ఉద్యోగం నుంచి తొలగించాడని బాస్ను హత్య చేసిన ఉద్యోగి..ఎక్కడో తెలుసా?
ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. జీతం ఇవ్వకుండా తనను ఉద్యోగంలోనుంచి తీసివేశాడని తన బాస్ను కత్తితో పొడిచాడు ఓ ఉద్యోగి. ఈ వార్త ముంబైలో తీవ్ర కలకలం సృష్టించింది. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గణేష్ పవార్ అనే వ్యక్తి మయాంక్ మన్దోత్ నడుపుతున్న కోచింగ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఆదివారం రోజున సాయంత్రం 6:30 గంటలకు కోచింగ్ సెంటర్ ఆఫీసుకు వెళ్లి తన జీతం ఇవ్వాల్సిందిగా మయాంక్తో గొడవపడ్డాడు గణేష్. వారిద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన గణేష్ పవార్... ఒక్కసారిగా పదునైన వస్తువుతో తన మెడపై వేటువేశాడు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన మయాంక్ మృతి చెందాడు.
గణేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 20న గణేష్ కోచింగ్ సెంటర్లో ఉద్యోగంలో చేరినట్లు చెప్పారు. అయితే సెప్టెంబర్ 18న ఎలాంటి కారణాలు చూపకుండా గణేష్ను ఉద్యోగం నుంచి మయాంక్ తొలగించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు ఒక నెల జీతం కూడా చెల్లించలేదని గణేష్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఇక లాభం లేదని భావించిన గణేష్ చివరి ప్రయత్నంగా జీతం అడుగుదామని ఆఫీస్కు వెళ్లాడని ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మయాంక్ను హత్యచేయాలని గణేష్ భావించినట్లు పోలీసులు చెప్పారు. ఇక ఇద్దరి మధ్య గొడవ జరిగిన సందర్భంలో మయాంక్ గణేష్ను గాయపరిచాడని పోలీసులు తెలిపారు.
హత్య జరిగిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గణేష్ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. గణేష్ పై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ముంబై నగరంలోనే మరో హత్య చోటుచేసుకుంది. ఓ మహిళతో తీవ్ర వాగ్వాదం అనంతరం ఓ వ్యక్తి ఆమె ముఖంపై రాళ్లతో కొట్టడంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు.