టిక్టాక్ పెట్టిన చిచ్చు.. భార్యను పొడిచి చంపిన భర్త
టిక్టాక్... ప్రస్తుతం ఈ యాప్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. షార్ట్ వీడియోలతో సంచలనం సృష్టిస్తున్న టిక్టాక్ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ దగ్గరైంది. ఆశ్లీలత, ఘర్షణలకు కారణమవుతుందన్న కారణంతో కొన్ని రోజుల పాటు ఈ యాప్ను బ్యాన్ చేసినా... నిషేధం ఎత్తివేసిన తర్వాత యూజర్లు మరింత పెరిగారు. పాటలు, డైలాగ్స్కు అనుగుణంగా లిప్ సింక్ చేయడంతో పాటు మనసులోని భావాలను నలుగురితో పంచుకునే ఈ యాప్ కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది.
సోషల్ మీడియాలో వల... 50మంది మహిళల్ని బెదిరించి లోబర్చుకున్న కామాంధుడు..
కాపురంలో టిక్టాక్ చిచ్చు
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ దారుణం జరిగింది. వెలినగర్ ప్రాంతానికి చెందిన కనకరాజ్ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య నందినితో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. నందిని దగ్గరలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తోంది. మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు రెండేళ్లుగా దూరం ఉంటున్నారు. ఇటీవల నందిని టిక్టాక్లో కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. వాటిలో అసభ్యమైన హావభావాలు ఉండటంతో అలాంటి వీడియోలు చేయవద్దని వారించాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి.
కత్తితో పొడిచి హత్య
గురువారం నందిని మళ్లీ టిక్టాక్లో అసభ్యకరమైన వీడియో పోస్ట్ చేయడంతో కనకరాజ్ ఆమెకు ఫోన్ చేశాడు. టిక్టాక్లో వీడియోలు మానుకుని బుద్ధిగా కాపురానికి రావాలని కోరాడు. అయితే నందినీ కాల్ చేయంతో మళ్లీ ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం సాయంత్రం కనకరాజ్, నందిని పనిచేస్తున్న కాలేజీకి వెళ్లాడు. మద్యంమత్తులో ఉన్న అతను ఆమెతో వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కనకరాజ్ వెంట తెచ్చుకున్న కత్తితో నందినిని మూడుసార్లు పొడిచాడు. అక్కడి నుంచి పరారయ్యాడు
కేసు నమోదుచేసిన పోలీసులు
భర్త కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన నందినిని కాలేజీ సిబ్బంది కోవై హాస్పిటల్కు తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న మధుకరై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కనకరాజ్ను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.