వార్నీ.. అప్పులు తీర్చుకోవాలని సొంతంగా నోట్లు ముద్రించేశాడు!
విదేశాల్లో చదువుకునే వారి కోసం కొన్నాళ్లు కన్సల్టెన్సీ నడిపిన ఓ వ్యక్తి.. ఆ క్రమంలో భారీగా అప్పులు చేసి, నష్టాలపాలై, తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించేందుకు నకిలీ కరెన్సీ ముద్రణకు తెరతీశాడు.
సూరత్: రవీగాంధీ నిన్నమొన్నటి వరకు విదేశీ విద్యాసేవల కన్సల్టెన్సీని నడిపేవాడు. ఈ కన్సల్టెన్సీని నడిపే క్రమంలో రూ. 70 లక్షల వరకు అప్పులు తెచ్చాడు. కానీ, కన్సల్టెన్సీలో భారీగా నష్టాలు వచ్చాయి. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేకపోయాడు.
ఈ నేపథ్యంలో అప్పులు ఇచ్చిన వాళ్లు తీవ్ర ఒత్తిడి చేయడంతో వాటిని చెల్లించేందుకు రవీగాంధీ ఓ పథకం వేశాడు. అదే.. సొంతంగా నోట్లు ముద్రించడం. నకిలీ నోట్లను తానే ముద్రించి.. వాటిని మార్కెట్లో చెలామణి చేయడం ద్వారా అప్పులు తీర్చాలనుకున్నాడు.
లక్ష రూపాయల అసలు కరెన్సీ నోట్లకు రూ. 3 లక్షల నకిలీ నోట్లు ఇచ్చే పథకంతో అతను తన అనుచరులతో మార్కెట్లోకి దిగాడు. కానీ పోలీసులకు సమాచారం అందడంతో అతని బండారం బట్టబయలైంది. ఇదీ గుజరాత్లోని సూరత్ పట్టణంలో భారీ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు వెనుక దాగి ఉన్న కథ.
నిందితుల నుంచి రూ. 40.73 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సుత్రధారి అయిన రవీగాంధీ (30)తోపాటు అతని అనుచరులు అజయ్ పటేల్, బాబులాల్ అలియాస్ బాబ్లూ మహాదేవ్ వాంఖడే, వాసులను అరెస్టు చేశారు.
విదేశాల్లో చదువుకునే వారి కోసం కొన్నాళ్లు కన్సల్టెన్సీ నడిపిన రవీగాంధీ.. నష్టాలు వచ్చి పెద్ద మొత్తంలో అప్పులు చేయడంతో.. వాటిని తిరిగి చెల్లించేందుకు నకిలీ కరెన్సీ ముఠాకు తెరతీశాడని పోలీసులు తెలిపారు.