దారుణం : హిందీలో మాట్లాడాడని రక్తమొచ్చేలా కొట్టారు
బెంగళూరు : బెంగళూరులో కొందరు వ్యక్తులు రెచ్చిపోయారు. హిందీలో మాట్లాడాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తుల్ని చావ చితకబాదారు. తమ రాష్ట్రంలో ఉంటూ తమ భాష మాట్లాడటంలేదని దుండగులు కోపంతో ఊగిపోయారు. వారి దాడిలో గాయపడ్డ బాధితులు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
హిందీలో మాట్లాడటంపై అభ్యంతరం
యూపీలోని లక్నోకు చెందిన ధృవ్ గుప్తా అనే వ్యక్తి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ ఆర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. జులై 24వ తేదీ రాత్రి 11.30గంటల సమయంలో సిగరెట్ కోసం ఫ్రెండ్తో కలిసి ఆర్టీ నగర్లోని ఓ షాపుకు వెళ్లాడు. ధృవ్కు కన్నడ రాకపోవడంతో షాపులో ఉన్న వ్యక్తితో హిందీలో మాట్లాడాడు. అతను హిందీలో మాట్లాడటం విన్న పక్కనే నిలబడ్డ ఆరుగురు వ్యక్తులు గమనించారు. అందులోని ఒక వ్యక్తి జోక్యం చేసుకుని కన్నడలో మాట్లాడాలని ధృవ్ ను బెదిరించాడు. అయితే తనకు కన్నడ రాదని, నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు.
కన్నడలో మాట్లాడనందుకు దాడి
ధ్రువ్ అతనితో మాట్లాడుతుండగానే అక్కడికి వచ్చిన మరో వ్యక్తి తన చేతిలోని హెల్మెట్తో దాడి చేశాడు. దీంతో అతని ముక్కుకు గాయమై రక్తం ధారగా కారింది. అది చూసి అడ్డుకునే ప్రయత్నం చేసిన ధ్రువ్ స్నేహితులపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుండగుల దాడిలో గాయపడ్డ ధ్రువ్తో పాటు అతని స్నేహితులు ట్రీట్మెంట్ దగ్గరలోని బాప్టిస్ట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు ముక్కుకు తీవ్ర గాయమైనట్లు చెప్పారు.
కేసు నమోదు
దాడి ఘటనకు సంబంధించి ధ్రువ్ అతని స్నేహితులు ఆర్టీ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు అకారణంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్ 341, 504 కింద కేసు నమోదుచేశారు. నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.