దారుణం : 'ఆమెకు ఎంతోమందితో అక్రమ సంబంధం.. అందుకే చంపేస్తున్నా..'
మధ్యప్రదేశ్లోని భిలాయిలో దారుణం జరిగింది. పలువురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంగా ఓ వ్యక్తి తన భార్యను,ఆమె ప్రియుడిని దారుణంగా హతమార్చాడు. ఘటనలో 15 రోజుల పసిపాప కూడా చనిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. భిలాయిలోని ఓ ఇంట్లో పోలీసులు మంగళవారం మూడు మృతదేహాలను గుర్తించారు. ఇందులో మంజు అనే మహిళతో పాటు మరో వ్యక్తి పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించారు. వీరిద్దరి కాళ్లు,చేతులు కట్టేసి నోటికి టేపు వేసినట్టు గుర్తించారు. సదరు వ్యక్తి మృతదేహాన్ని గ్యాస్ స్టవ్పై గుర్తించినట్టు సమాచారం. కాలిపోయిన మహిళ పక్కనే ఉన్న బెడ్పై పసిపాప కూడా చనిపోయి ఉన్నట్టు గుర్తించారు.
మృతదేహాలు ఉన్న గదిలో గోడపై నిందితుడు రాసిన అక్షరాలను పోలీసులు గుర్తించారు. 'మంజు వల్ల నా సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు.ఎంతోమందితో ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆమెను హత్య చేస్తున్నా. ఆమెనే కాదు.. ఆమె కుటుంబంలో ప్రతీ ఒక్కరినీ హత్య చేస్తా..' అని నిందితుడు గోడపై రాయడం గమనార్హం. నిందితుడిని మంజు భర్త రవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఒడిశాలోని రూర్కెలాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
హత్యకు ముందు అతను తెల్లవారుజామున 4గంటలకు మంజు తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. 'మీ కుమార్తె,అల్లుడు కాలిపోతున్నారు.. దమ్ముంటే వచ్చి కాపాడుకోండి..' అని ఫోన్ చేసి చెప్పినట్టు గుర్తించారు. మంజు తల్లిదండ్రులు ఆ తర్వాత అదే ఫోన్ నంబర్కు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి.. మృతదేహాలు ఉన్న గది పూర్తిగా పొగతో నిండిపోయింది. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. మంజును,ఆమె ప్రియుడిని నిందితుడు దారుణంగా హతమార్చగా.. పొగ కారణంగా పసిపాప చనిపోయినట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ,మంజు ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.