భార్యను కిడ్నాప్ చేశారని స్టేషన్కు వెళ్లిన భర్త.. పోలీసులు ఏం చేశారంటే..?
మెయిన్పురి : పోలీసులు... ఆ మాట వింటేనే ఇప్పటికీ చాలా మంది వణికిపోతారు. అలాంటి ఖాకీ మార్కు అలా ఉంటుంది మరి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, ప్రజల కోసమే మేమున్నామంటూ వారు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. అందుకు కారణం వారు వ్యవహరించే తీరు. పోలీసులపై నమ్మకం కోల్పోయే ఇలాంటి ఓ ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని స్టేషన్ గడపతొక్కిన పాపానికి ఓ వ్యక్తికి ఖాకీలు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి నరకం చూపారు.
నిద్రమత్తులో డ్రైవర్.. కాల్వలో పడిపోయిన బస్సు.. 29 మంది మృతి
బైక్పై వెళ్తుండగా భార్య కిడ్నాప్
ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గమైన మెయిన్పురిలోని బులంద్ షహర్కు చెందిన వ్యక్తి తన భార్యతో కలిసి బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఆ దంపతులు మోటార్ బైక్పై అలీగఢ్ - కాన్పూర్ హైవేపై వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు దుండగులు వారిని అడ్డగించారు. మహిళను కిడ్నాప్ చేశారు. అడ్డుకోబోయిన భర్తపై దాడి చేశారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు.
పోలీసులను ఆశ్రయించిన భర్త
కాసేపటికి స్పృహలోకి వచ్చిన భర్త సాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పి కిడ్నాపైన తన భార్యను కాపాడమని కోరాడు. అయితే సాయం చేయాల్సిన పోలీసులు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భర్తనే అనుమానించారు. పెళ్లాన్ని చంపేసి తమ వద్దకొచ్చి నాటకాలాడుతున్నాడని అతన్ని చావ చితకబాదారు. తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడంటూ ఖాకీలు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో బాధితుడి చేతి వేళ్లు రెండు విరిగిపోయాయి. మెడతో పాటు కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి.
రేప్ చేశారని భార్య కంప్లైంట్
భర్తకు నరకం చూపించిన కొన్ని గంటల తర్వాత అతని భార్య పోలీస్ స్టేషన్కు చేరుకుంది. తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి, తన వద్దనున్న బంగారం దోచుకుని తనను నిర్జన ప్రదేశంలో వదిలేశారని ఫిర్యాదు చేసింది. దీంతో పోీలసులు ఎట్టకేలకూ ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులపై రేప్, కిడ్నాప్, దోపిడి కేసు బుక్ చేశారు. ఫిర్యాదుచేసేందుకు వచ్చిన వ్యక్తిపై జులుం ప్రదర్శించిన ఖాకీల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బిచ్వాన్ పోలీస్ స్టేషన్.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రజనీష్ పాల్ సింగ్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే మెడికల్ రిపోర్టులో మహిళపై అత్యాచారం జరగలేదని, ఆమె ఒంటిపై గాయాలేమీ లేవని తేలిందని పోలీసులు చెప్పడం విశేషం.