ఏడాది బాలుడికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన వైద్యులు...20 ఏళ్ల తర్వాత శిక్ష
చెన్నై: 20 ఏళ్ల క్రితం నాటి కేసులో చెన్నై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 20 ఏళ్ల క్రితం ఏడాది బాలుడికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఓ ప్రైవేట్ హాస్పిటల్కు రూ.20 లక్షలు బాధితుడికి చెల్లించాలంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఇక వివరాల్లోకి వెళితే... 1999లో అప్పుడే పుట్టిన శిశువు విరేచనాలు వాంతులతో బాధపడుతుంటే ఆ చిన్నారిని చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దీన్నే ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్గా కూడా పిలుస్తారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు రక్తం ఎక్కించాలని ఆ తర్వాత సర్జరీ చేయాలని చెప్పారు.. బాలుడి తల్లిదండ్రులకు ఏమి చేయాలో తెలియక ఏదైనా చేసి తన బిడ్డను కాపాడాల్సిందిగా కోరారు. ఇక రక్తం ఎక్కించారు. సర్జరీ జరిగింది. అయితే మళ్లీ కొద్ది రోజులకే ఆ బాలుడు అనారోగ్యంతో మంచం పట్టాడు.
బాలుడిని మరో హాస్పిటల్కు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇక అక్కడ బ్లడ్ టెస్టులు చేయగా బాలుడికి హెచ్ఐవీ సోకినట్లు వైద్యులు తెలిపారు. అయితే తల్లిదండ్రులకు ఈ వ్యాధి లేకపోవడంతో బిడ్డకు ఎలా సోకిందనే ప్రశ్న మొదలైంది. వెంటనే జరిగిన విషయం చెప్పగా అసలు సంగతి వెలుగు చూసింది. అంతకుముందు హాస్పిటల్లో ఆ చిన్నారికి హెచ్ఐవీ సోకిన రక్తం ఎక్కించారని తేలింది. దీంతో ఏమి చేయాలో తెలియలేదు తల్లిదండ్రులకు . ఇక తమకు న్యాయం చేయాలని కోర్టుకు వెళ్లారు.
కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి ఆ ప్రభుత్వ హాస్పిటల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు గత 20 ఏళ్లుగా ఆ కుటుంబం పొందుతున్న మనో వేదన వర్ణించలేనిదని భావించింది. ఆ కుటుంబానికి రూ.20 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. అంతేకాదు ప్రస్తుతం ఆ బిడ్డకు 21 ఏళ్లు వచ్చాయి. అతనికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే అప్పుడే రూ.50,000 చెల్లించినట్లు ప్రభుత్వ హాస్పిటల్ చెప్పింది. అయితే అది అతని వైద్య ఖర్చులకు కూడా సరిపోయి ఉండవని జడ్జి పేర్కొన్నారు.