కదిలించే కథ: భార్యను కాపాడుకోవాలన్న తాపత్రయంతో ఈ తండ్రి ఏడాది కొడుకును అమ్మేశాడు
ఉత్తర్ ప్రదేశ్ : ఓ వైపు కట్టుకున్న భార్య పురిటి నొప్పులతో బాధపడుతోంది... మరోవైపు ఆమెకు చికిత్స చేయించేందుకు చేతిలో చిల్లి గవ్వ లేదు. అర్థాంగిని ఎలాగైనా కాపాడుకోవాలని భావించాడు. అందుకు కన్న కొడుకును కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు.తన భార్య మీద ఇష్టంతో ఆమెను బతికించుకోవాలనే దృఢ సంకల్పంతో తన కొడుకును అమ్మి వచ్చిన డబ్బుతో భార్యకు చికిత్స చేయిద్దామనుకున్నాడు. ఈ కదిలించే ఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
కనౌజ్ జిల్లా సౌరిఖ్ గ్రామంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు అరవింద్ కుమార్ అనే వ్యక్తి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆయన కుటుంబానిది. ఇక తన భార్య సుఖ్ దేవి నిండు గర్భవతి. మంగళవారం రాత్రి ఆమెకు నొప్పులు రావడంతో స్పృహ కోల్పోయింది. భార్యను ఎలాగైనా బతికించుకోవాలనుకున్నాడు అరవింద్. కానీ చికిత్స చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వలేదు. ఎలాగో అలాగా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తన భార్యకు సరిపడా రక్తం లేదని కొందరు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో కాన్పు చేయడం ప్రమాదమని చెప్పారు. చికిత్సకు రూ.25వేలు అవుతుందని, ఐదు యూనిట్ల రక్తం కూడా అవసరం అవుతుందని చెప్పారు.
ఏమి చేయాలో పాలుపోని అరవింద్ తన బంధువులకు ఫోన్ చేసి సహాయం చేయాల్సిందిగా అర్థించాడు. కానీ ఎవరూ ముందుకు వచ్చి చిల్లిగవ్వ ఇచ్చిన పాపాన పోలేదు. అప్పటికే అరవింద్ దంపతులకు మూడేళ్ల పాప, ఏడాది వయసున్న బాబు ఉన్నారు. ఇక చేసేదేమీలేక... ఏడాది వయస్సున్న చంటిపిల్లాడిని అమ్మేందుకు సిద్ధపడ్డాడు. పిల్లలు లేని దంపతులు అరవింద్ కొడుకును కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. రూ.25వేలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు రాగా... అరవింద్ వారిని రూ.40వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.30వేలకు బేరం కుదిరింది. డబ్బలు ఇచ్చి చిన్నారిని కొనుగోలు చేశాకా.. ఏమైందో తెలియదు కానీ... దంపతులు మనసు మార్చుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు అరవింద్ తన భార్యను అడ్మిట్ చేసిన హాస్పిటల్కు చేరుకున్నారు. అరవింద్ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఉన్న సంగతి తెలిపాడు. అయితే అరవింద్పై చర్యలు తీసుకోకుండా పోలీసులు మానవత్వంతో ఆలోచించి చికిత్సకయ్యే ఖర్చును చందాలుగా ఇచ్చారు. అంతేకాదు తన భార్యకు కావాల్సిన రక్తాన్ని కూడా దానం చేశారు ఖాకీలు. తన భార్య పరిస్థితి చూసి అరవింద్ షాకయ్యాడని... తనకు సహాయం చేసేందుకు ఎవరూ రాకపోవడంతో కొందరు చెప్పిన మాటలు విని తన కొడుకును అమ్మేందుకు సిద్ధపడ్డాడని ఎస్ఐ బ్రిజేంద్ర సింగ్ తెలిపాడు. ప్రస్తుతం కనౌజ్ మెడికల్ కాలేజీలో అరవింద్ భార్య సుఖ్దేవీ చికిత్స పొందుతోందని ఎస్ఐ వివరించారు.