వేధింపులు, ఫిర్యాదు చేసేందుకు వెళ్లి శవమయ్యాడు
ముజఫర్ నగర్: ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లిన వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని షామిలి జిల్లాలోని గ్రామంలో నివాసం ఉంటున్నబచన్ దాస్ అనే ఆయన మరణించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. బచన్ దాస్ బుధవారం ముజఫర్ నగర్ లోని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం దగ్గరకు బయలుదేరాడు. గురువారం అదే కార్యాలయం ఆవరణంలో శవమై కనిపించాడు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మరణించిన బచన్ దాస్ చేతిలో ఉన్న ఒక కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యం తన కుమార్తెను ఇద్దరు యువకులు వేధిస్తున్నారని, దయచేసి న్యాయం చేసి వారిద్దరి మీద కఠిన చర్యలు తీసుకొవాలని ఆ కాగితంలో రాశాడని పోలీసులు చెప్పారు.
వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన బచన్ దాస్ జిల్లా మెజిస్ట్రేట్ ను కలవలేకపోయానని బాధతో విషం సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ముజఫర్ నగర్ పోలీసులు తెలిపారు.