ఎస్బీఐ ఏటీఏంలో పిల్లలు ఆడుకునే నోట్లు పెట్టిన వ్యక్తి అరెస్ట్
ఎస్బీఐ ఏటీఎంలో చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ రూ.2000 నోట్లు రావడానికి కారకుడైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: ఎస్బీఐ ఏటీఎంలో చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ రూ.2000 నోట్లు రావడానికి కారకుడైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడైన మహమ్మద్ ఇషా అనే వ్యక్తిని పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో అదుపులోకి తీసుకున్నారు.
దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ రూ.2000 నోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. చూడటానికి ఇవి అసలు నోట్లుగానే కనిపించినా.. ఈ నోటుపై ఆర్బీఐకి బదులుగా చిల్డ్రెన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, గ్యారెంటీడ్ బై చిల్డ్రన్స్ గవర్న్మెంట్ అని ఉంది. నోటుపై ఒకపక్క చూరన్ లేబుల్ అనిరాసి ఉంది. బ్యాంకు సీల్కు బదులుగా పీకే లోగో ఉంది.
దక్షిణ ఢిల్లీలోని చత్తార్పూర్ కాల్సెంటర్లో పనిచేసే రోహిత్ అనే వ్యక్తికి మొదటగా ఈ నకిలీ నోట్లు రాగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఘటనపై ఆ బ్యాంకు అధికారులు కూడా విచారణ చేపట్టారు.
నిందితుడు మహమ్మద్ ఇషా ఏటీఎంలలో నగదు పెట్టే బాధ్యత చేపట్టిన కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని, అతడే పిల్లలు ఆడుకునే నోట్లను సంగమ్ విహార్ ఏటీఎంలో పెట్టాడని పోలీసులు తెలిపారు.