బోరుబావిలో..15 అడుగుల లోతులో: సజీవంగా తిరిగొచ్చిన యువకుడు.. !
బెంగళూరు: సాధారణంగా బోరు బావులను మృత్యు కుహరాలుగానో.. యమపురికి ముఖద్వారంగానో పిలుస్తుంటారు. బోరుబావిలో పడిన పిల్లలు మళ్లీ సజీవంగా వెనక్కి తిరిగి రాలేరనడానికి సింబాలిక్గా వాటిని అలా పిలుస్తుంటారు. బోరుబావిలో పడి ప్రాణాలతో బయటికి వచ్చిన పిల్లల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి మృత్యుకుహరంలో పడ్డ ఓ యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. సుమారు ఏడు గంటల పాటు ఏకధాటిగా శ్రమించిన సహాయక బృందాలు అతణ్ని ప్రాణాలతో బయటికి తీసుకుని రాగలిగారు.
YS Jagan: భారతితో కలిసి లక్నో వెళ్లొచ్చిన వైఎస్ జగన్: ప్రశాంత్ కిశోర్తో భేటీ..!
Recommended Video
ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో చోటు చేసుకుంది. బోరుబావిలో పడ్డ ఆ యువకుడి పేరు రోహిత్. ఉడుపి జిల్లా బైండూర్ సమీపంలోని మరవంతె గ్రామానికి చెందిన రైతు కూలీ. ఆదివారం పొరపాటున తన పొలంలో వేసిన బోరుబావిలో పడిపోయాడు. దాని లోతు సుమారు వంద అడుగుల పైమాటే. నీరు పడకపోవడంతో దాన్ని అలాగే వదలేశాడు. పొలం పనుల్లో నిమగ్నమైన రోహిత్.. పొరపాటున అందులోకి జారిపోయాడు.
అదృష్టం ఏమిటంటే- అతను 15 అడుగుల లోతులోనే ఇరుక్కుపోయాడు. చిన్న పిల్లలతో పోల్చుకుంటే భారీ శరీరం కావడం వల్ల అక్కడే చిక్కుకుపోయాడు. రోహిత్ బోరుబావిలోకి పడిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టారు. అగ్నిమాపక దళానికి సమాచారం ఇచ్చారు.
ఒకవైపు బోరుబావిలోకి ఆక్సిజన్ను పంపిస్తూ.. మరోవైపు దానికి సమాంతరంగా జెసీబీతో గుంతను తవ్వారు. భూమి వదులుగా ఉండటం వల్ల సహాయక సిబ్బందికి కలిసి వచ్చింది. సహాయక పనులు వేగవంతం కావడానికి వీలు పడింది. ఏడుగంటల పాటు శ్రమించిన అనంతరం రోహిత్ను ప్రాణాలతో బయటికి తీసుకుని రాగలిగారు. ముందు జాగ్రత్త చర్యగా అందుబాటులోకి తీసుకొచ్చిన అంబులెన్స్ ద్వారా అతణ్ని ఆసుపత్రికి తరలించారు.