విలాసవంతమైన జీవితం కోసం బంగారు దొంగలించాడు...ఈ దొంగను పట్టించిందెవరో తెలుసా.?
మైసూరు: విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఓ 53 ఏళ్ల వ్యక్తి దొంగతనాలు చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికాడు. ఒడిషాకు చెందిన మొహ్మద్ సల్మాన్ అనే వ్యక్తి తరుచూ బెంగళూరుకు వెళ్లేవాడు. అక్కడ నగల దుకాణాలకు ఓ కస్టమర్లా వెళ్లేవాడు. అక్కడే నగలను పరిశీలించినట్లు పరిశీలించి మూడో కంటికి కనపడకుండా చోరీ చేసేవాడు. ఇలా తరుచూ చేసేవాడు. తాజాగా మైసూరులోని ఓ నగల దుకాణంలోకి వెళ్లిన మొమ్మద్ సల్మాన్ అక్కడ 108 గ్రాముల బంగారం బిస్కెట్ను దొంగలించాడు. దీని విలువ రూ.3.78 లక్షలు. ఇక మొహ్మద్ సల్మాన్ ఆంధ్రప్రదేశ్లో బంగారం వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం.
గత నెలలో మైసూరుకు వెళ్లిన సల్మాన్... అశోకా రోడ్డులోని ఓ నగల దుకాణంకు వెళ్లాడు. తను బంగారం బిస్కెట్ను కొనాలని ఆ షాపు యజమానితో చెప్పాడు. అయితే గోల్డు బిస్కెట్లు తాము అమ్మడం లేదని అయితే మరుసటి రోజు వస్తే అవి ఎక్కడ దొరుకుతాయో కనుక్కుని చెబుతానని షాపు యజమాని చెప్పాడు. అనుకున్నట్లుగానే మరుసటి రోజున బంగారు దుకాణంకు వెళ్లిన మొహమ్మద్ సల్మాన్ను షాపు యజమాని అమిత్ రాజేంద్ర అనే వ్యక్తి షాపుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లగానే సల్మాన్ బంగారు బిస్కెట్ను ఒక్కసారిగా లాక్కుని షాపులో నుంచి బయటకు పరుగులు తీసి... జనవాసంలో కలిసిపోయాడు. ఇక చేసేదేమీ లేక రాజేందర్ పోలీసులకు ఫోన్ చేసి చోరీ గురించి చెప్పాడు. షాపు దగ్గరకు చేరుకున్నపోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆ తర్వాత సల్మాన్ బ్యాగ్, బిస్కెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇక దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొహ్మద్ ఫోన్ కాల్స్ పై దృష్టి పెట్టారు. ఆయన నగరంలో ఎక్కడున్నడన్నదానిపై ట్రేస్ చేశారు. కాల్ డేటాను పరిశీలించగా సల్మాన్ ఫోన్ నుంచి ఓ నైట్ పబ్లోని అమ్మాయిలతో ఎక్కువగా సంభాషణలు జరిపినట్లు తెలుసుకున్నారు. ఆయన ఫోనులో దాదాపు వెయ్యికి పైగా అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఉన్నాయని గుర్తించారు. ఇక నైట్ పబ్లో పనిచేస్తున్న అమ్మాయిలను విచారణ చేయగా సల్మాన్ ఎక్కడ ఉంటాడనేది వారు చెప్పారు. దీంతో అక్కడికి వెళ్లి సల్మాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎక్కడెక్కడ చోరీకి పాల్పడ్డాడో అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.