బెంగళూరుపై ఉగ్ర పడగ? మెట్రో స్టేషన్లో పేలుళ్లకు యత్నం? ఆగంతకుడి కదలికలు
బెంగళూరు: సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరు ఉగ్రవాదుల పడగ నీడలో ఉందా? జన సమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదం ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు పోలీసులు. బెంగళూరులో తాజాగా నెలకొన్న పరిస్థితులు కూడా ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఈస్టర్ సండే నాడు శ్రీలంక నరమేథానికి పాల్పడటానికి ముందు ఉగ్రవాదులు బెంగళూరు, కేరళలల్లో కలియ తిరిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని శ్రీలంక ప్రభుత్వం కూడా ధృవీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో- బెంగళూరులో ఉగ్రవాదుల కదలికలు విసృతమైనట్లు తెలుస్తోంది.
తాజాగా- సోమవారం రాత్రి అత్యంత రద్దీతో కూడుకుని ఉండే మెజెస్టిక్ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగాడాడు. అతని కదలికలన్నీ స్టేషన్ ఆవరణలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీల్లో నిక్షిప్తం అయ్యాయి. ఈ ఫుటేజీని పోలీసులు అన్ని కోణాల్లోనూ విశ్లేషించారు. అనంతరం మీడియాకు విడుదల చేశారు. ఆ వ్యక్తి పొడుగు చేతుల చొక్కా ధరించి, నల్లరంగు జాకెట్ను ధరించినట్లు ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఛాతీ మీద బరువైన వస్తువులు ఉన్నట్లు సెక్యూరిటీ గార్డు గుర్తించారు.
మెటల్ డిటెక్టర్ వద్ద అడ్డుకున్న సెక్యూరిటీ గార్డు..
మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్కు చేరడానికి ముందు- మెటల్ డిటెక్టర్ను ఏర్పాటు చేశారు మెట్రో స్టేషన్ అధికారులు. మెటల్ డిటెక్టర్ దాటుకుని ఆ వ్యక్తి లోనికి ప్రవేశించగానే.. సెక్యూరిటీ గార్డు అతణ్ని అక్కడే నిలిపివేయడాన్ని ఫుటేజీల్లో రికార్డయ్యింది. అతని చొక్కాను కూడా తనిఖీ చేయడాన్ని చూడొచ్చు. ఆగంతకుడు లోనికి ప్రవేశించడాన్ని సెక్యూరిటీ గార్డు అనుమతి ఇవ్వలేదు. దీనితో అతను అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయిన దృశ్యం సీసీటీవీలో నమోదైంది. భారీ ఇనుప వస్తువు ఉన్నట్లు మెటల్ డిటెక్టర్ ద్వారా శబ్దం రావడం వల్ల తాను అతణ్ని అక్కడే ఆపి వేశానని సెక్యూరిటీ గార్డు చెబుతున్నారు. క్షుణ్నంగా పరిశీలించడానికి ఆ ఆగంతకుడు అవకాశం ఇవ్వలేదని, తాను ప్రశ్నిస్తుండగానే అతను అక్కడి నుంచి జారుకున్నాడని చెబుతున్నాడా సెక్యూరిటీ గార్డు. అతని ఛాతీ మీద బరువైన వస్తువులు ఉన్నట్లు తాను గుర్తించానని, దాని గురించి ప్రశ్నిస్తుండగా వెనక్కి వెళ్లిపోయాడని చెప్పాడు.
జల్లెడ పడుతున్న పోలీసులు
మెట్రో స్టేషన్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. వారికి ఈ దృశ్యాలు పలు అనుమానాలను రేకెత్తించాయి. వెంటనే వారు ఈ ఫుటేజీని పోలీసులకు అందజేశారు. శ్రీలంక దాడులకు ముందు ఉగ్రవాదులు బెంగళూరు, కేరళల్లో కలియ తిరిగారంటూ ఆ దేశ ప్రభుత్వం నుంచి సమాచారం అందిన నేపథ్యంలో- అనుమానించదగ్గ ఏ చిన్న అంశాన్ని కూడా పోలీసులు వదలట్లేదు. ఈ ఫుటేజీని ఆధారంగా చేసుకుని ఆ ఆగంతకుడి కోసం జల్లెడ పట్టారు. గాలింపు చర్యలు చేపట్టారు. దీనికోసం బెంగళూరు పోలీసులు జాతీయ దర్యాప్తు సంస్థ సహకారాన్ని కూడా తీసుకోవచ్చని తెలుస్తోంది.
ఆగంతకుడి కోసం మూడు బృందాలు
ఈ సమాచారం అందుకున్న వెంటనే పశ్చిమ మండలం డీసీపీ రవి చెణ్ణన్నవార్ మెజెస్టిక్ మెట్రో రైల్వేస్టేషన్ను సందర్శించారు. ఆయన వెంటనే బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సభ్యులు కూడా ఉన్నారు. ఆగంతకుడి కదలికలపై సెక్యూరిటీ గార్డును అడిగి మరిన్ని విషయాలను తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫుటేజీని మీడియాకు విడుదల చేశారు. ఆగంతకుడి కోసం అన్వేషిస్తున్నామని డీసీపీ తెలిపారు. దీనికోసం మూడు బృందాలన ఏర్పాటు చేశానని, వాటికి ఏసీపీ మహంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు.
కాగా- భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్కు చెందిన స్లీపర్ సెల్స్ బెంగళూరు సహా కర్ణాటక-కేరళ సరిహద్దుల్లోని కాసరగోడ్ జిల్లాల్లో ఉన్నారంటూ ఇదివరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాసరగాడ్కు చెందిన పలువురు స్థానికులు ఐసిస్లో చేరారంటూ ఇదివరకే జాతీయ దర్యాప్తు సంస్థ కూడా నిర్ధారించింది. ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానించిన ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆయా పరిస్థితుల నేపథ్యంలో- బెంగళూరును మరోసారి ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని, షెల్టర్ జోన్గా తీర్చదిద్దుకున్నారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
యాసిర్ భత్కల్ కన్నడిగుడే..
దిల్షుక్నగర్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాది యాసిర్ భత్కల్ కన్నడిగుడే కావడం గమనార్హం. కర్ణాటకలోని తీర ప్రాంత పట్టణమైన భత్కల్కు చెందిన వాడు. దిల్షుక్నగర్లో సైకిల్ బాంబు ద్వారా 32 మందిని బలిగొన్న ఘటనలో యాసిర్ భత్కల్ ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం అతను తీహార్ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.
భద్రత కట్టుదిట్టం..
ఇదిలావుండగా- మెట్రో స్టేషన్లో ఆగంతకుడి అనుమానాస్పద కదలికలు కనిపించిన మరుక్షణమే బెంగళూరు నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. అన్ని మెట్రో స్టేషన్లతో పాటు రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల గుర్తింపు కార్డులు, బ్యాగులు, లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి వెళ్లడానికి అనుమతి ఇస్తున్నారు.