సుమలతతో కాంగ్రెస్ పార్టీ నాయకుల రహస్య భేటీ: హైకమాండ్ ఆదేశాలు పట్టించుకోని నాయకులు!
బెంగళూరు: మండ్యలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బహుబాష నటి సుమలతతో కాంగ్రెస్ పార్టీ నాయకులు రహస్యంగా భేటీ అయ్యారని వెలుగు చూసింది. బెంగళూరులోని ప్రముఖ హోటల్ లో సుమలతతో మండ్యకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మండ్యలో స్వంతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో భేటీ అయ్యి తనకు ఎన్నికల్లో సహకరించిన దానికి ధన్యవాదాలు తెలిపారని తెలిసింది. హైకమాండ్ ఆదేశాలను లెక్కచెయ్యని నాయకులు సుమలతో భేటీ అయ్యారు.
బెంగళూరులోని ప్రముఖ హోటల్ లో సుమలతో భేటీ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చెలువరాయస్వామి, రఘువీర్ గౌడ, మళవళ్ళి నరేంద్ర స్వామి, మళవళ్ళి శివన్న, మాగాడి బాలక్రిష్ణ తదితరులు ఉన్న వీడియో బయటకు వచ్చింది.
సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చెయ్యకుండా చెలువరాయస్వామితో పాటు అనేక మంది దూరంగా ఉన్నారు. నిఖిల్ కుమారస్వామికి మద్దతుగా ప్రచారం చెయ్యని ఈ నాయకులు సుమలతకు మద్దతు ప్రకటించారని ఆరోపణలు ఉన్నాయి.
సుమలతకు మద్దతు ప్రకటించిన నాయకులను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీకి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ హెచ్చరించారు. అయితే కొందరు నాయకులు కాంగ్రెస్ హైకమాండ్ ను ధిక్కరించి సుమలతతో భేటీ అవుతున్నారు.