మాజీ ఎంపీ, నటి రమ్యాకు ఫుల్ క్లాస్
బెంగళూరు: మాజీ పార్లమెంట్ సభ్యురాలు, కాంగ్రెస్ నాయకురాలు, బహుభాష నటి రమ్యకు మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణ ఫుల్ క్లాస్ ఇచ్చారు. రాజకీయాలలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
శనివారం ఉదయం బెంగళూరు నగరంలోని సదాశివనగరలో నివాసం ఉంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.ఎం. కృష్ణ ఇంటికి రమ్యా వెళ్లారు. తరువాత ఆయనతో భవిష్యత్తు రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చించారు. మండ్య జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి పని చెయ్యాలని ఎస్.ఎం. కృష్ణ సూచించారు.
అంతే కాకుండా స్థానిక నాయకులకు తెలియకుండా మండ్య జిల్లాలో పర్యటించడం నీకే మంచిది కాదని, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే అది నీకే మంచిదని రమ్యాకు సలహా ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ మండ్య జిల్లాకు చెందిన వారు.
అనంతరం రమ్యా విలేకరులతో మాట్లాడారు. తాన విద్యాభ్యాసం, రాజకీయ భవిష్యత్తు గురించి ఎస్.ఎం. కృష్ణ తో క్షుణ్ణంగా చర్చించానని చెప్పారు. ఇటివల రమ్యా మండ్య జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను కలిసి రావడంతో అక్కడి నాయకులు గుర్రున ఉన్న విషయం తెలిసిందే. రమ్యా ప్రస్తతుం ఎంఎల్ సీ సీటు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.