ట్రబుల్ షూటర్ ఎంట్రీ, సీఎం ఒత్తిడి, తెలుగింటి ఆడపడుచు సుమలతకు చెక్, లీడర్స్ యూటర్న్!
బెంగళూరు: కర్ణాటకలో మండ్య రాజకీయం మరింత రసవత్తరంగా మారిపోయింది. ఆదివారం మండ్య రాజకీయాల్లో జోక్యం చేసుకున్న త్రిబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మంత్రి డీకే. శివకుమార్ ఇంత వరకు ఉన్న మండ్య జిల్లా రాజకీయాలను తనదైన శైలిలో పూర్తిగా మార్చేశారు.
మాజీ ప్రధాని ఫ్యామిలీ ప్యాకేజ్, తండ్రి, కొడుకులు, కొడలు, మనుమడు, ఏం మిగిలింది స్వామి!
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఒత్తిడితో మండ్య చేరుకున్న డీకే. శివకుమార్ ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. మండ్య జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలకు చోటు ఇవ్వకుండా చూసే భాద్యతను మంత్రి డీకే. శివకుమార్ కు అప్పగించారు.
సుమలతకు టిక్కెట్
మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకుంటే తాను స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాజీ మంత్రి రెబల్ సార్ట్ అంబరీష్ సతీమణి సుమలత బహిరంగంగా ప్రకటించడంతో సీఎం కుమారస్వామి సతమతం అవుతున్నారు. మండ్య లోక్ సభ సీటు జేడీఎస్ కు ఇవ్వాలని సీఎం కుమారస్వామి పట్టుబడుతున్నారు.
డీకే. శివకుమార్ ఆదేశాలు
మండ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశం అయిన మంత్రి డీకే. శివకుమార్ సుమలతకు మద్దతు ఇవ్వకూడదని, పార్టీ నాయకులకు చెప్పినట్లు నడుచుకోవాలని ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది. ఇంతకాలం సుమలతకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా మంత్రి డీకే. శివకుమార్ వైపు వచ్చారని సమాచారం.
సుమలతకు షాక్ ?
ఆదివారం రాత్రి పోద్దుపోయే వరకు మంత్రి డీకే. శివకుమార్ తో చర్చలు జరిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తరువాత సుమలతతో భేటీ అయ్యారని తెలిసింది. ఇంతకాలం మద్దతు ఇచ్చిన నాయకులు ఇప్పుడు తాము హైకమాండ్ చెప్పినట్లు నడుచుకుంటామని చెప్పడంతో సుమలత షాక్ కు గురైనారని సమాచారం. సోమవారం సాయంత్రం తన నిర్ణయం ప్రకటిస్తానని సుమలత ఆమె సన్నిహితులతో చెప్పారని తెలిసింది.
కొడుకు కోసం సీఎం స్కెచ్
మండ్య లోక్ సభ స్థానం నుంచి తన కుమారుడు, సినీ హీరో నిఖిల్ కుమారస్వామిని పోటీ చేయించి గెలిపించుకోవాలని సీఎం కుమారస్వామి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అందులో భాగంగా మంత్రి డీకే. శివకుమార్ ను రంగంలో దించి పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.
సానుభూతి ఓట్లు
మండ్యలో రెబల్ స్టార్ అంబరీష్ ప్రభావం ఇంకా ఉంది. అంబరీష్ మీద ఉండే అభిమానం సుమలతను గెలిపించే అవకాశం ఉంది. అంబరీష్ మీద విపరీతమైన అభిమానం, ఆయన మండ్య జిల్లాకు చేసిన సేవలను అక్కడి ప్రజలు మరిచిపోలేదు. ఇదే సమయంలో సీఎం కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ సుమలతను చులకనగా మాట్లాడిన మాటలతో అక్కడి ప్రజలు ఆమె మీద సానుభూతి ఎక్కువగా చూపిస్తున్నారు
బీజేపీ మాస్టర్ ప్లాన్
కొంత మంది బీజేపీ నాయకులు సైతం సుమలతను ఆ పార్టీలోకి ఆహ్వానించి అదే పార్టీ నుంచి పోటీ చేయించాలని భావించారు. అయితే ఇంత వరకు బీజేపీ నాయకులు సుమలతతో చర్చలు జరపలేదు. బీజేపీ నాయకులు సైతం మండ్యకు చెందిన బీజేపీ నాయకులతోనే పోటీ చేయించాలని, సుమలతను కొంతకాలం పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారని తెలిసింది.