కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన నటి రమ్యా ఫ్యాన్స్, ఉప ఎన్నికల్లో బీజేపీకి జై, మేడమ్ కే మోసం !
బెంగళూరు: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్, బహుబాష నటి రమ్యా అలియాస్ దివ్యా స్పందన అభిమానులు సొంత పార్టీ నాయకులకు సినిమా చూపిస్తున్నారు. గతంలో రమ్యా ప్రాతినిథ్యం వహించిన మండ్య (కర్ణాటక) లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో తాము బీజేపీకి మద్దతు ఇస్తామని రమ్యా ఫ్యాన్స్ బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో రమ్యా మేడమ్ ను మోసం చేసిన వ్యక్తికి తాము మద్దతు ఇవ్వలేమని ఆము అభిమానులు అంటున్నారు.
సంకీర్ణ ప్రభుత్వం
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. మండ్య లోక్ సభ నియోజక వర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి జేడీఎస్ ఆసక్తి చూపించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ పార్టీ నుంచి ఎల్ఆర్. శివరామేగౌడ పోటీలో దిగారు.
రమ్యాకు వ్యతిరేకి
ఎల్ఆర్. శివరామేగౌడ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని, ఆ సందర్బంలో పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పని చేశారని ఆమె అభిమానులు ఆరోపించారు. 2014 లోకసభ ఎన్నికల్లో రమ్యా ఓడిపోవడానికి శివరామేగౌడ ప్రయత్నించారని, రమ్యా ఆ ప్రాంతంలో అడుగుపెట్టకుండా చేశారని ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు.
మేడమ్ ను ఓడించాను
2014 శివరామేగౌడ జేడీఎస్ లో చేరిన సందర్బంలో తానే రమ్యా ఓటమికి పని చేశానని స్వయంగా శివరామేగౌడ బహిరంగంగా చెప్పారని ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు. అలాంటి శివరామేగౌడ గెలుపుకు తాము ఎలా పని చేస్తామని రమ్యా అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు.
బీజేపికి లాభం
మండ్య లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి డాక్టర్ సిద్దరామయ్య బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేడీఎస్ అభ్యర్థి ఎల్ఆర్. శివరామేగౌడ పోటీ చేస్తున్నారు. అయితే రమ్యాకు వ్యతిరేకంగా మాట్లాడిన శివరామేగౌడకు మద్దతుగా తాము పని చెయ్యలేమని, ఈ సారి బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తామని ఆమె అభిమానులు బహిరంగంగా అంటున్నారు. మండ్యలో కాంగ్రెస్ లోని అసమ్మతి సెగ బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
10 రోజుల్లో సీన్ రివర్స్
2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శివరామేగౌడ రమ్యాకు మద్దతుగా పని చేసి ఉంటే ఆమె విజయం సాధించేవారని, ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉండేది కాదని ఆమె అభిమానులు అంటున్నారు. నబంబర్ 3వ తేదీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. మండ్యలోని కనక భవన్ లో ఈనెల 23, 24వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి రమ్యా అభిమానులకు సర్థిచెప్పాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే రమ్యా అభిమానులు మాత్రం తాము ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తామని అంటున్నారు.