బీజేపీ కోర్ కమిటీలో సుమలత, ఎవరు విదేశాల్లో రౌండ్స్, మాజీ సీఎంకు పంచ్ !
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎంపీ, బహుబాష నటి, రెబల్ స్టార్ అంబరీష్ భార్య, తెలుగింటి ఆడపడుచు సుమలత అంబరీష్ ఇప్పుడు సంచలనానికి కేంద్ర బిందువు అయ్యారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ప్రత్యక్షం అయిన స్వతంత్ర పార్టీ ఎంపీ సుమలత మీద కర్ణాటక మాజీ సీఎం హెచ్. డీ. కుమారస్వామి పలు ఆరోపణలు చేశారు. మాజీ సీఎం కుమారస్వామి ఆరోపణలకు ఎంపీ సుమలత తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
పాకిస్థాన్ కు డాక్టర్ భార్య, వీసా రద్దు, ఉగ్రవాదులతో లింక్, బెంగళూరు చర్చి పేలుళ్లు !
ఎవరు విదేశాల్లో రౌండ్స్ !
లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత తాను, తన కుమారుడు ఓటమి భయంతో విదేశాలకు వెళ్లి అక్కడే ఉన్నారని కొందరు ప్రచారం చేశారని సుమలత గుర్తు చేశారు. అయితే విదేశాలకు ఎవరెవరు వెళ్లారు అనే విషయం మండ్య ప్రజలతో పాటు ప్రపంచానికే తెలుసని మాజీ సీఎం కుమారస్వామి మీద సుమలత మండిపడ్డారు. విదేశాలకు ఎవరు వెళ్లింది అనే విషయం ఫోటోలు, వీడియో సాక్షాలు ఉన్నాయని ఎంపీ సుమలత అన్నారు.
సుమలతపై విమర్శలు
గత లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో బహుబాష నటి సుమలత మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మద్దతుతో అప్పటి ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ కుమారస్వామి మండ్య నుంచి పోటీ చేశారు. అప్పట్లో దేశం మొత్తం మండ్య లోక్ సభ ఎన్నికలకు కేంద్ర బిందువు అయ్యింది.
ఎవరు గెలుస్తారు !
మండ్య లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన తరువాత అక్కడ ఎవరు గెలుస్తారు అనే విషయం ఇంటెలిజెన్స్ అధికారులు సైతం పసిగట్టలేకపోయారు. అయితే కొన్ని మీడియాల్లో అప్పటి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి గెలుస్తారని ప్రచారం చేశాయి. మండ్యలో ఎవరు గెలుస్తారు అనే విషయం ఎవ్వరు చెప్పలేకపోయారు.
అసలు ఏం జరిగింది ?
ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమి భయంతో సుమలత, ఆమె కుమారుడు విదేశాలకు వెళ్లిపోయి అక్కడే ఉన్నారని అప్పట్లో హెచ్.డీ. కుమారస్వామి ఆరోపణలు చేశారు. తాను విదేశాలకు వెళ్లిపోలేదని, భారత్ లోనే ఉన్నానని, పాత విమానం టిక్కెట్లు సోషల్ మీడియాలో పోస్టు చేసి తన మీద ఆరోపణలు చేస్తున్నారని ఆ సమయంలో సుమలత మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు రావడం, సుమలత భారీ మెజారిటీతో గెలవడం తరువాత తెలిసిన విషమే.
బీజేపీ కోర్ కమిటీ మీటింగ్
లోక్ సభ ఎన్నికల సమయంలో మండ్య నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చెయ్యలేదు. తమ పార్టీ అభ్యర్థిని పోటీకి నిలపకుండా బీజేపీ పరోక్షంగా సుమలతకు మద్దతు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల సమయంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మండ్యలో సుమలతకు మద్దతుగా ఓటు వెయ్యాలని మనవి చేశారు. ప్రధాని మోడీ ఇలా మాట్లాడటంతో సుమలత కచ్చితంగా బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే బుధవారం బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి సుమలత హాజరు కావడంతో మరోసారి ఈ విషయంపై జోరుగా చర్చజరుగుతోంది.
బీజేపీలోకి సుమలత ?
బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సుమలత బీజేపీలో చేరే విషయంలో మీడియాకు క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీలో చేరితే ముందుగా మండ్య ప్రజలకు, మీడియాకు సమాచారం ఇస్తానని సుమలత అన్నారు. ఈ రోజు (బుధవారం) ఇక్కడికి రావడానికి ఓ కారణం ఉందని సుమలత చెప్పారు. మండ్య లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తనకు ఎంతో సహాయం చేశారని సుమలత అన్నారు, తాను ఎంపీగా విజయం సాధించిన తరువాత మండ్య ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పానని, ఈ రోజులు ఇక్కడికి వచ్చింది బీజేపీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పడానికే అని సుమలత క్లారిటీ ఇచ్చారు.