రెబల్ స్టార్ కు ఎమ్మెల్యే టిక్కెట్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ద్వంసం, మోసం చేశారు!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా టిక్కెట్ ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయికి చేరింది. కర్ణాటక మాజీ మంత్రి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ కు టిక్కెట్ కేటాయించడంతో మండ్యలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ద్వంసం చేశారు. అంబరీష్ కు టిక్కెట్ ఇవ్వకూడదని రవికుమార్ గణిగ అలియాస్ రవి గణిగ అనుచరులు ఆందోళనకుదిగారు.
అర్జీ ఇవ్వకున్నా టిక్కెట్
మండ్య శాసన సభ నియోజక వర్గం నుంచి తాను పోటీ చేస్తానని, టిక్కెట్ ఇవ్వాలని రెబల్ స్టార్ అంబరీష్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అర్జీ సమర్పించలేదు. అయితే ఎవ్వరూ ఊహించనిరీతిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంబరీష్ కు టిక్కెట్ కేటాయించింది.
Recommended Video
అంబరీష్ పై అసమ్మతి
అంబరీష్ కు టిక్కెట్ కేటాయించడానికి వ్యతిరేకిస్తూ సోమవారం మండ్య పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలోకి చోరబడిన కార్యకర్తలు ఫర్నీచర్, కంప్యూటర్లు ద్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. రవి గణిగకు టిక్కెట్ కేటాయించాలని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
చివరి ఎన్నికలు
2013 శాసన సభ ఎన్నికల సమయంలో మండ్య నుంచి రెబల్ స్టార్ అంబరీష్, రవి గణిగ ఇద్దరూ పోటీ చెయ్యడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఈ శాసన సభ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అని చెప్పారని, అందుకే అప్పట్లో తాను పోటీ నుంచి తప్పుకున్నానని, అంబరీష్ ఇప్పుడు మళ్లీ టిక్కెట్ సంపాధించుకున్నారని సోమవారం మీడియా ముందు రవి గణిగ ఆరోపించారు.
నామినేషన్ వేస్తా
గత ఎన్నికల సమయంలో తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అంబరీష్ ను కచ్చితంగా ఓడిస్తానని, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా తాను మండ్య శాసన సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తానని రవి గణిగ హెచ్చరించారు.
రాజీ ప్రసక్తే లేదు
గత శాసన సభ ఎన్నికల సమయంలో అంబరీష్ నియోజక వర్గంలో ప్రచారం చెయ్యడానికి రాలాదని, తానే స్వయంగా నియోజక వర్గంలో ప్రతి ఇల్లు తిరిగి ఆయన్ను గెలిపించామని, ఇప్పుడు నన్నే మోసం చేశారని, తాను ఈసారి మాత్రం రాజీ అయ్యే ప్రసక్తేలేదని రవి గణిగ తేల్చి చెప్పారు.