సీఎం గ్రామ వాస్తవ్యం, రైతు నెత్తిన రూ. 1. 20 లక్షలు రుణం, 13 ఏళ్లు పూర్తి, బిల్లులు మాత్రం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి గ్రామ వాస్తవ్యం ( గ్రామంలో రాత్రి నిరుపేద ఇంటిలో బస చెయ్యడం) కార్యక్రమం ప్రతిపక్షాలకు అస్ర్తంగా చిక్కింది. గతంలో హెచ్.డి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన గ్రామ వాస్తవ్యం ఇప్పుడు తెరమీదకు వచ్చింది.
గ్రామ వాస్తవ్యం వలన తాను అప్పులపాలైనానని, సకాలంలో రుణం చెల్లించలేకపోయానని ఒక రైతు ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. జేడీఎస్ కు కంచు కోటగా ఉన్ప మండ్య జిల్లా రైతు నేడు ఆరోపణలు చేస్తున్నారు, సీఎం కులానికి చెందిన రైతు ఆరోపణలు చెయ్యడంతో సీఎం వర్గీలు ఆందోళనకు గురైనారు.
2006 నాటి కథ
2006లో కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి భాద్యతలు నిర్వహించారు. 2006 నవంబర్ నెలలో మండ్య జిల్లాలోని కేఆర్ పేట తాలుకా, నెవిలుమారనహళ్ళిలో అప్పటి ముఖ్యమంత్రి కుమారస్వామి గ్రామ వాస్తవ్యం కార్యక్రమానికి జేడీఎస్ నాయకులు, అధికారులు శ్రీకారం చుట్టారు.
రైతుకు మాయమాటలు
గ్రామంలో నివాసం ఉంటున్నమాయేగౌడను సంప్రదించిన జేడీఎస్ నాయకులు, అధికారులు రాత్రి మీ ఇంటిలో సీఎం కుమారస్వామి బస చేస్తారని, ఆరోజు ఇక్కడే నిద్రపోతారని, రోడ్లు, ఇల్లు మరమత్తులు చేసి శుభ్రంగా పెట్టుకోవాలని, అందుకు అయ్యే ఖర్చు తరువాత పైసాలతో సహా చెల్లిస్తామని చెప్పారు.
రైతు ఇంటిలో సీఎం
స్వయంగా సీఎం కుమారస్వామి తన ఇంటికి వస్తున్నారని, అంత కంటే తనకు ఏం కావాలని మాయేగౌడ రూ. 1. 20 లక్షలు అప్పు చేసి రోడ్ల గుంతలు పూడ్చి, ఇల్లు మరమత్తులు చేశారు. ఆ రోజు రాత్రి సీఎం కుమారస్వామి మాయేగౌడ ఇంటిలో బస చేసి మరుసటి రోజు మీడియా సమావేశంలో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పట్టించుకోని లీడర్స్
అయితే మాయేగౌడ చేసిన రుణం 13 సంత్సరాలు అయినా అధికారులు ఇంత వరకు చెల్లించలేదు. నీ పరిస్థితి ఏమిటి అని ఇప్పటి వరకు జేడీఎస్ నాయకులు మాయేగౌడను ప్రశ్నించలేదని, తన పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని ఇప్పుడు మాయేగౌడ ఆవేదన వక్తం చేస్తున్నారు.
పట్టించుకోని మంత్రి
మంత్రి సీఎస్. పుట్టరాజును కలిసి తనకు చెల్లించాల్సిన రూ. 1.20 బిల్లులు ఇప్పించాలని మనవి చేసినా ఫలితం లేకపోయిందని రైతు మాయేగౌడ ఆవేదన చెందుతున్నారు. సీఎం గ్రామ వాస్తవ్యం అంటే ఇదేనా ? అంటూ మాయేగౌడ ప్రశ్నిస్తున్నారు.
చెట్లు విక్రయించి !
సీఎం కుమారస్వామి గ్రామ వాస్తవ్యం కార్యక్రమం వలన తాను అప్పులపాలైనా మా గ్రామం బాగుపడిందని మాయేగౌడ అంటున్నాడు. అయితే తన ఇంటిలో సీఎం ఉండటానికి అప్పట్లో తాను రూ. 1. 20 లక్షలు అప్పు చేశానని, రుణ ఒత్తిడి ఎక్కువ కావడంతో తన పొలంలోని చెట్లు విక్రయించి అప్పులు తీర్చానని, ఇలాంటి గ్రామ వాస్తవ్యం కార్యక్రమాలతో సీఎం కుమారస్వామి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటూ అధికారుల నుంచి అన్ని వివరాలు సేకరించాలని రైతు మాయేగౌడ మనవి చేస్తున్నారు.