మాయావతి టికెట్ల వ్యాపారి... మేనకగాంధీ సంచలన ఆరోపణలు
సుల్తాన్పూర్ : పోలింగ్కు సమయం దగ్గరపడేకొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది. విపక్షాలపై విమర్శలు, ప్రతివిమర్శలతో నాయకులు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఇదే క్రమంలో కేంద్రమంత్రి మేనకా గాంధీ కూడా ప్రచారంలో జోరుపెంచారు. యూపీ సుల్తాన్పూర్ నుంచి బరిలో దిగుతున్న ఆమె బీఎస్పీ అధినేత్రి మాయావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చైనీస్ భాషలో ఓటర్లకు గాలం! తృణమూల్ కాంగ్రెస్ వినూత్న ప్రచారం!
మాయావతి టికెట్ల వ్యాపారి
సుల్తాన్పూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మేనకాగాంధీ విమర్శల పదును పెంచారు. బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి టికెట్ల వ్యాపారిగా మారిపోయారని ఆరోపించారు. మాయావతి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి కోట్లు ఇచ్చిన వారికి టికెట్లు అమ్ముతున్నారని అన్నారు. మాయా ఒక్కో సీటుకు 15 నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేస్తారన్న విషయం అందరికీ తెలుసన్న మేనక.. ఆ విషయాన్ని పార్టీ కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటారని అన్నారు.
నగదు, వజ్రాల రూపంలో లంచాలు
బీఎస్పీ అధినేత్రికి 77 ఇళ్లు ఉన్నాయని మేనకా గాంధీ ఆరోపించారు. ఆమె వజ్రాలు, నగదు రూపంలో మాత్రమే లంచాలు తీసుకుంటారని చెప్పారు. ప్రజలను దోచుకోవడమే బెహన్ జీ లక్ష్యమని మేనక విమర్శించారు. బీఎస్పీ టికెట్ కోసం నాయకులు లంచంగా తీసుకుంటున్న 20 కోట్లు వారు ప్రజల నుంచి దోచుకున్నవి కాదా అని ప్రశ్నించారు.
బీఎస్పీని ఓడించాలని పిలుపు
కరెన్సీ కట్టల గురించి తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోని బీఎస్పీకి ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పాలని మేనకాగాంధీ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు.