బాధితురాలు ఎప్పుడు బయటకు వచ్చిందనేది కాదు: తనుశ్రీ దత్తాకు మేనకా గాంధీ మద్దతు
ముంబై: ప్రముఖ నటి తనుశ్రీ దత్తాకు కేంద్రమంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. తనుశ్రీ ఇటీవల సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల ఆమె నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు. పదేళ్ల క్రితం సినిమా సెట్లో తన చేయి పట్టుకున్నారని చెప్పింది. ఇదీ సంచలనంగా మారింది.
తనుశ్రీ ఆరోపణల నేపథ్యంలో ప్రియాంకా చోప్రా, ట్వింకిల్ ఖన్నా, ఫర్హాన్ అక్తర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇదే విషయమై తాజాగా మేనకా గాంధీ కూడా స్పందించారు. వేధింపులను ఉపేక్షించేది లేదని చెప్పారు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై ఎప్పుడు బయటకు వచ్చారనేది విషయం కాదన్నారు.
మన దేశంలో కూడా 'మీటూ' ఉద్యమం ప్రారంభం కావాలన్నారు. దీని ద్వారా ఏ మహిళ అయినా సరే తనకు ఎదురైన వేధింపుల గురించి మాకు ఫిర్యాదు చేయవచ్చునని, మేం దానిపై విచారణ జరుపుతామన్నారు.
తనుశ్రీ ఇన్నేళ్ల తర్వాత వేధింపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రజలు అడుగుతున్నారని ప్రశ్నించగా... హాలీవుడ్ దర్శకుడు హార్వే వెయిన్స్టీన్ వేధించారని ఓ నటి చెప్పినప్పుడు కూడా ప్రజలు ఇలానే అన్నారని, కానీ బాధితురాలు ఎప్పుడు ముందుకొచ్చి చెప్పింది అనేది విషయం కాదన్నారు.