వరుణ్గాంధీ యూపీ సీఎం ఐతే: మేనకా, బీజేపీ స్పందన
న్యూఢిల్లీ: ఇటీవలి సార్వత్రిక ఎన్నిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ నుండి 73 లోకసభ స్థానాలు గెలుచుకోవడం భారతీయ జనతా పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. తాజాగా, ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. సమాజ్వాది, బహుజన సమాజ్వాది పార్టీలకు ధీటుగా.. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీలకంటే తమకే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే అవకాశముందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో గాంధీల కుటుంబ సభ్యుడు, ఎంపీ వరుణ్ గాంధీ పేరును ఆయన తల్లి, కేంద్రమంత్రి మేనకా గాంధీ ముందుకు తీసుకు వస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఆదివారి పిలిబిత్లో ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తదుపరి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుణ్ అయితే బాగుటుందని ఆమె వ్యాఖ్యానించారట.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, యూపిలో ఎస్పీ ప్రభుత్వం ఉందని ఆమె అన్నారు. లోకసభ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత ములాయం సింగ్ యాదవ్ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఆపేశారని ఆరోపించారు. వాటిని తమ ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్తుందన్నారు.
అదే సమయంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీని వరుణ్ గాంధీ నడిపిస్తే బాగుంటుందని, పిలిబిత్కు గర్వకారణమని ఆమె అన్నారు.
మరోవైపు, మేనక వ్యాఖ్యల పైన ఎస్పీ ప్రభుత్వం మండిపడింది. ఎస్పీ నేత అహ్మద్ హసన్ మాట్లాడుతూ.. బీజేపీ నేతలు తన పిల్లలను ప్రమోట్ చేయాడానికి ఉబలాటపడుతున్నారని మేనకా గాంధీ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందన్నారు. మరోవైపు, బీజేపీ ఉత్తర ప్రదేశ్ మేనకా గాంధీ వ్యాఖ్యల పైన స్పందిస్తూ.. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు.