వీజీ సిద్ధార్థ వ్యక్తిగత సిబ్బందిపై ప్రశ్నల వర్షం? కార్యాలయంలో సోదాలు..హార్డ్ డిస్క్ స్వాధీనం!
బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషణ మొదలు పెట్టారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల ప్రేరేపించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా- మంగళూరు పోలీసులు బుధవారం ఉదయం వీజీ సిద్దార్థ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. విఠల్ మాల్యా రోడ్డులో గల వీజీ సిద్ధార్థ ప్రధాన కార్యాలయానికి ఈ ఉదయం చేరుకున్న పోలీసులు అక్కడి ఉద్యోగులను ప్రశ్నించారు.
చివరిసారిగా ఆయన ఎవరిని కలుసుకున్నారనే విషయంపై ప్రశ్నలు కురిపించారు. సిద్దార్థ వినియోగించే ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన వినియోగించే కంప్యూటర్ కు సంబంధించిన కొన్ని హార్డ్ డిస్కులను సీజ్ చేశారు.
CCD Owner's Death: ఎవరా ఐటీ డీజీ? మైండ్ ట్రీలోని సిద్ధార్థ షేర్లు మాత్రమే అటాచ్ ఎందుకు?
వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై మంగళూరు ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే. ఆయన కారు డ్రైవర్ బసవరాజ్ పాటిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా సుమారు ఎనిమిది మంది పోలీసులు ఈ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. విఠల్ మాల్యా రోడ్డులో గల కార్యాలయంలో విస్తృత సోదాలు చేపట్టారు. వారంరోజుల వ్యవధిలో సిద్దార్థను కలుసుకున్న వారి వివరాలను సేకరించారు. దీనికి సంబంధించిన కొన్ని సీసీటీవీ ఫుటేజీలను సైతం మంగళూరు పోలీసులు పరిశీలించారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి సహా మరో వ్యక్తిగత సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.