కేంద్ర మంత్రి, సీఎం అభ్యర్థి మీద క్రిమినల్ కేసు: కాంగ్రెస్ పార్టీ లేడీ లీడర్ ప్రతిభా ప్రతీకారం !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ సీనియర్ నాయకులు మీద కాంగ్రెస్ పార్టీ మహిళా నేత క్రిమినల్ కేసులు పెట్టారు. ఎవరిదో ఫోటో పెట్టకుండా తన ఫోటో పెట్టి మా పరువు తీశారని ఆరోపిస్తూ మంగళూరు కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కర్ణాటక శాఖ కార్యదర్శి, మంగళూరు నగర కార్పొరేటర్ ప్రతిభా కుళాయి క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
చార్జ్ షీటు విడుదల
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం అరాచకాలు అంటూ బీజేపీ నాయకులు ఇటీవల చార్జ్ షీటు విడుదల చేశారు.
ఫోటో తారుమారు
కాంగ్రెస్ పార్టీ అరాచకాలు అంటూ బీజేపీ విడుదల చేసిన చార్జ్ షీట్ లో బీబీఎంపీ (బెంగళూరు కార్పొరేషన్) జేడీఎస్ కార్పొరేటర్ మంజుల నారాయణస్వామి చీర లాగిన వివరాలు ఉన్నాయి. అయితే అందులో మంజుల నారాయణస్వామి ఫోటోకు బదులు మంగళూరు కార్పొరేటర్ ప్రతిభా కుళాయి ఫోటో ముద్రించారు.
మా పరువు తీశారు
మంజుల నారాయణస్వామి ఫోటోకు బదులు తన ఫోటో ముద్రించి మా పరువు తీశారని, బీజేపీ నాయకుల మీద కఠినచర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ ఇప్పటికే ప్రతిభా కుళాయి మంగళూరు నగర సిటీ పోలీసు కమిషనర్ టీఆర్. సురేష్ కు ఫిర్యాదు చేశారు.
బీజేపీ సీనియర్ లీడర్స్
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లేతో సహ ఐదు మంది మీద మంగళూరు జేఎంఎఫ్ సీ 2వ న్యాయస్థానంలో ప్రతిభా కుళాయి క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈనెల 19వ తేదీన కోర్టులో కేసు విచారణ జరగనుంది.