5ఎకరాల మామిడి తోట: సచిన్, ఐశ్వర్య, మోడీల పేర్లు, నెక్స్ట్ కేజ్రీ
లక్నో: పలు మామిడిపండ్ల రకాలను సృష్టించి, వాటికి ప్రముఖుల పేర్లను పెట్టే ప్రముఖ ఉద్యానవవేత్త హాజీ కలీముల్లా ఖాన్.. కొత్త హైబ్రిడ్ మామిడికి నమో ఆమ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరును ఇటీవల పెట్టారు. ప్రపంచ ప్రముఖుల నేతల జాబితాలో చేరిన మోడీలాగానే ఈ మామిడి పండు సైతం వెలుగులోకి రాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధానిగా ప్రమాణ ప్రమాణ స్వీకారోత్సవానికి పొరుగుదేశాల నేతలను ఆహ్వానించడం ద్వారా మోడీ స్నేహహస్తాన్ని చాచారని, పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండటం ప్రపంచంలోనే సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని, దీనిని స్ఫూర్తిగా తీసుకొని కొత్త మామిడికి నమో ఆమ్ పేరు పెట్టినట్లు చెప్పారు.
హాజీ కలీముల్లా ఖాన్ గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరు, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ తదితరుల పేర్లు పెట్టారు. వీరు పేర్లు పెట్టడానికి గల కారణాన్ని ఆయన చెబుతూ... తన మామిడి పండ్లు సదరు లెజెండ్స్ను శాశ్వత కీర్తిని కలిగించేందుకేనని చెప్పారు.
కాగా, హాజీ కలీముల్లా ఖాన్ పండ్ల తోట ఐదు ఎకరాల మేర విస్తరించి ఉంది. ఇది మలిహాబాదులో ఉంది. ఇందులో వివిధ రకాల మామిడి పండ్లను, కొత్త రకం మామిడి పంట్లను సాగు చేస్తారు. ఈ పండ్ల తోట వంద సంవత్సరాల క్రితంది అని తెలుస్తోంది.
దీనిని 1987 నుండి ఇందులో వివిధ రకాల పండ్లు సాగు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు మూడు వందల రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇందులో వివిధ రకాల వెరైటీస్, ఆకారాలు, పరిమాణం కలిగిన పండ్లను సాగు చేస్తుంటారు. ఇతనికి పద్మశ్రీ కూడా వచ్చింది. తన తదుపరి మామిడి పండుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు పెడతానని చెప్పారు.