పాక్కి వెళ్లి నా అంతానికి సుపారీ ఇచ్చారు: అయ్యర్పై మోడీ సంచలనం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అడ్డు తొలగించడానికి బహిష్కృత కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్థాన్ వెళ్లి 'సుపారీ' ఇచ్చారని ప్రధాని మోడీ ఆరోపించారు.
అవమానమే, మూల్యం చెల్లించుకుంటారు: కాంగ్రెస్కు మోడీ వార్నింగ్, మణిశంకర్కు కౌంటర్
శుక్రవారం ఉత్తర గుజరాత్లోని బనస్కాంఠ జిల్లాలో తాలూకా కేంద్రమైన భాభర్లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడారు. మణిశంకర్ అయ్యర్ ఇటీవల మోడీని నీచ్(తక్కువ మనిషి) తీవ్ర వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి అది తెలుస్తుంది..
‘మణిశంకర్ అయ్యర్ ఏమి చేశారో మీకు తెలుసా? నన్ను దూషించారు. నన్ను అన్నారా? మిమ్మల్ని అన్నారా? గుజరాత్ను అన్నారా? సంస్కారయుతమైన భారత సమాజాన్ని అన్నారా? ఆ విషయాన్ని పక్కనపెడదాం. దీనిని గుజరాత్ ప్రజలు చూసుకుంటారు. తగిన సమాధానం ఇస్తారు. డిసెంబరు 18న ఆ ఫలితమేమిటో వారికి (కాంగ్రెస్కు) తెలుస్తుంది' అని మోడీ వ్యాఖ్యానించారు.
అంతం చేసేందుకు పాక్కు సుపారీ
‘కానీ ఆ వ్యక్తి (అయ్యర్) నేను ప్రధాన మంత్రి అయిన తరువాత పాకిస్థాన్ వెళ్లారు. కొంతమంది పాకిస్థానీయులతో మాట్లాడారు. వారితో ఏమన్నారంటే ‘మోడీని దారి నుంచి తొలగించనంతవరకు (జబ్ తక్ మోదీ కో రాస్తే సే హఠాయా నహీ జాతా..) భారత్, పాకిస్థాన్ల మధ్య సంబంధాలు మెరుగుపడవు' అని అన్నారు. ఈ వివరాలన్నీ సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. ఇప్పుడు మీలో ఎవరైనా చెప్పండి... ‘మోడీని దారి నుంచి తొలగించండి (రాస్తే సే హఠ్నా)' అంటే అర్థం ఏమిటో..! మోడీ హత్యకు ‘సుపారీ' (హత్య కోసం చెల్లించే ధనం) ఇవ్వడానికి ఆయన పాకిస్థాన్ వెళ్లారా? ఈ సంభాషణ మూడేళ్ల క్రితం జరిగింది. ఈ ఉదంతాన్ని కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది. గత మూడేళ్లగా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పని సంస్కృతే అంతా ‘అట్కానా'(ఆటంకం కలిగించడం), ‘లట్కానా'(సమస్యను పరిష్కరించకుండా ఉండడం), ‘భట్కానా'(సమస్యను పక్కదోవ పట్టించడం)లను కాంగ్రెస్ నమ్ముతోంది' అని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2015లో అయ్యర్ పాకిస్థాన్ వెళ్లి అక్కడి టీవీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మోడీ పై విమర్శలు చేయడం గమనార్హం.
నన్ను లక్ష్యంగా చేసుకున్నారు..
‘నేను చేసిన నేరం ఏమిటి? దేశ ప్రజలు నన్ను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నారు. మీరేమో పాకిస్థాన్కు వెళ్లి ఈ మనిషి దారికి అడ్డంగా వస్తున్నాడు. తొలగించండి అని చెబుతారు' అని మోడీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అయినా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, తనను ‘మాతా అంబే' రక్షిస్తోందని మోడీ అన్నారు.
మన జవాన్లను కూడా వీళ్లు నమ్మరు
భారత సైనికులు పాకిస్థాన్లో చేసిన మెరుపుదాడులనూ కాంగ్రెస్ సందేహించిందని మోడీ విమర్శించారు. ‘మన జవాన్ల సాహసాలను విని దేశప్రజలంతా గర్వించారు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే సంతోషంగా లేదు. నిజంగా మెరుపుదాడులు జరిగాయా? జరగలేదని పాకిస్థాన్ అంటోంది కదా? మన సైనికులు ఎందుకు గాయపడలేదు? ఇలాంటి ప్రశ్నలు అడిగింది. ఈ విషయంలో మీరు పాకిస్థాన్ను నమ్ముతారా? భారత్ను నమ్ముతారా?' అని మోడీ నిలదీశారు.
పేదరికంలో పుట్టినందుకే నీచుడినా?
సోనియా గాంధీ, ఆమె కుటుంబ సభ్యులు తనను తిట్టడం ఇది తొలిసారేమీ కాదని మోడీ అన్నారు. నికోల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తనను నీచుడంటూ వారు గతంలోనూ కించపరిచారని చెప్పారు. ‘నేనెందుకు నీచుడ్ని. పేదరికంలో పుట్టినందుకా? తక్కువ కులానికి చెందినందుకా? గుజరాతీ అయినందుకా? ఎందుకు వారు నన్ను ద్వేషిస్తున్నారు' అని ప్రశ్నించారు.