ఒంటి గది ఇంటిలోకి మాణిక్ సర్కార్: కలిసి పనిచేస్తామని రామ్ మాధవ్
అగర్తలా: రెండు దశాబ్దాల పాటు త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్ సర్కార్ ఒంటి గది ఇంటిలోకి మకాం మార్చారు. త్రిపుర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిపిఎం ఓటమి పాలు కావడంతో మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
పదవి నుంచి దిగిన వెంటనే ఆయన తన నివాసాన్ని ఒంటిగది ఇంటిలోకి మార్చుకున్నారు. నాలుగు విడతలు ఆయన త్రిపురకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుత నివాసం సిపిఎం కార్యాలయంలో ఉంది. గురువారం ఆయన ఆ నివాసానికి మారారు.
ఇలా ఉంటారని....
మాణిక్ సర్కార్ పార్టీ కార్యాలయం అతిథి గృహంలోని ఒక గదిలో తన భార్య పాంచాలి భట్టాచార్యతో కలిసి ఉంటారని సిపిఎం నేత బిజన్ ధర్ చెప్పారు. దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు పెద్ద యెత్తున ఆస్తులు కూడగట్టుకున్న నేపథ్యంలో మాణిక్ సర్కార్ దేశంలోని ముఖ్యమంత్రులందరిలోకి అతి నిరుపేద సిఎంగానే ఉండిపోయారు.
పార్టీ కార్యాలయం వంటకాలేనని...
పెద్ద ఎత్తున సరుకూ సరంజామా లేకుండా కొత్త ఇంటిలోకి ప్రవేశించిన మాణిక్ సర్కార్ పార్టీ కార్యాలయం వంటగదిలో ఏవి వండితే అవే తాను తింటానని వంట మనిషికి చెప్పినట్లు సమాచారం. గురువారం సాయంత్రం ఆయన వద్దకు బిజెపి నేత రామ్ మాధవ్ వచ్చారు. బిజెపి ప్రభుత్వం పదవీ స్వీకారానికి ఆహ్వానించడానికి ఆయన స్వయంగా వచ్చారు.
ఆయన అక్కడికి మారవచ్చు...
కొన్ని పుస్తకాల కట్టలు, , దుస్తులు, కొన్ని సీడీలు మాణిక్ సర్కార్ పార్టీ కార్యాలయానికి చేరవేశారని, కొత్త ప్రభుత్వం కేటాయించే ప్రభుత్వ క్వార్టర్లో ఆయన మారవచ్చునని దాస్ అన్నారు. మార్క్సిస్టు సాహిత్యాన్ని, పుస్తకాలను తాను పార్టీ కార్యాలయం గ్రంథాలయానికి, బీర్చంద్ర సెంట్రల్ లైబ్రరీకి ఇస్తున్నట్లు అంతకు ముందు మాణిక్ సర్కార్ భార్య పాంచాలి భట్టాచార్య పిటిఐతో చెప్పారు.
అది పార్టీ నిర్ణయమే...
తాను ఎక్కడ ఉండాలనే విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందని మాణిక్ సర్కార్ అన్నారు. ఆయనకు అగర్తలాలో తన పూర్వీకుల నుంచి సంక్రమంచిన ఇల్లు, 900 చదరపు అడుగుల స్థలం ఉన్నాయి. అక్కడి నుంచి ఆయన తన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి దాంట్లో ఏ విధమైన మార్పులు కూడా చేయలేదు.