బీజేపీకి అగ్నిపరీక్ష... మణిపూర్ అసెంబ్లీలో నేడే బల నిరూపణ... బీరెన్ సింగ్ నెగ్గేనా..?
మణిపూర్లో బీజేపీ ప్రభుత్వ బలం నేడు తేలిపోనుంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సోమవారం(అగస్టు 10) అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఈ మేరకు మణిపూర్ అసెంబ్లీ సెక్రటరీ రమణి ఒక ప్రకటన జారీ చేశారు. శాసనసభలో సోమవారం బీరెన్ సింగ్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతారని అందులో పేర్కొన్నారు.
Recommended Video
మణిపూర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నింగోంబం బూపేంద మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి బదులు బీజేపీ ప్రభుత్వ విశ్వాస తీర్మానాన్ని శాసనసభ ఆమోదించిందన్నారు. ఏదేమైనా బీజేపీ విశ్వాస తీర్మానం వీగిపోతుందని కాంగ్రెస్ నమ్మకంగా ఉందన్నారు. ఇప్పటికే తమ పార్టీకి చెందిన 24 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసినట్లు తెలిపారు. శాసనసభలో బీజేపీ విశ్వాస తీర్మానాన్ని ఓడించి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును నిజం చేస్తామన్నారు.
బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి 9 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. నిజానికి 2017 ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లు సాధించింది. బీజేపీ 21 స్థానాలు సాధించగా కాంగ్రెస్ 28 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే కాంగ్రెస్ కంటే ముందే పావులు కదిపిన బీజేపీ.. ఎన్పీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యే,ఒక తృణమూల్ ఎమ్మెల్యే,ఒక స్వతంత్ర ఎమ్మెల్యేను తమవైపుకు తిప్పుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ఇటీవల ఆ పార్టీకి మద్దతునిచ్చిన ఎమ్మెల్యేలంతా మద్దతు ఉపసంహరించుకున్నారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. మొత్తం 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయగా, మరో నలుగురు అనర్హత వేటుకు గురయ్యారు.
విశ్వాస పరీక్ష నేపథ్యంలో బీజేపీ కూడా తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. తమ పార్టీకి 30 మంది సభ్యుల బలం ఉందని విశ్వాస పరీక్షలో సులువుగా నెగ్గుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తికేంద్ర సింగ్ తెలిపారు. అటు కాంగ్రెస్ కూడా తామే గెలుస్తామని ధీమాగా చెబుతుండటంతో బల నిరూపణపై ఉత్కంఠ నెలకొంది.