Mirabai Chanu : ఒలింపిక్స్లో భారత బోణీ మీరాబాయి చానుకు రూ.1కోటి నజరానా
ఒలింపిక్స్-2021 క్రీడా సంగ్రామం మొదలైన రెండో రోజే భారత్కు రజత పతకం సాధించింది పెట్టింది మీరాబాయి చాను. మణిపూర్కు చెందిన 26 ఏళ్ల ఈ యువతి దాదాపు 21 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో భారత్కు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మెడల్ సాధించి పెట్టింది. 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి కాంస్య పతకం గెలవగా... మళ్లీ ఇన్నేళ్లకు మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్లో పతకం తీసుకొచ్చింది.
Recommended Video
మీరాబాయి చాను పతకం సాధించడంతో సొంత రాష్ట్రం మణిపూర్లో సంబరాలు జరుపుకుంటున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మీరాబాయి చానుకి రూ.1కోటి నజరానా ప్రకటించారు. ప్రస్తుతం రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ ఉద్యోగంలో ఉన్న మీరాబాయి చానుకు ఉన్నత స్థాయి ఉద్యోగం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 'ఇక రైల్వే స్టేషన్లలో టికెట్లు కలెక్ట్ చేసే పని నీవు చేయవు. నీకోసం ఓ ప్రత్యేక పోస్టును రిజర్వ్ చేస్తున్నా.'అంటూ ట్విట్టర్లో ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పేర్కొన్నారు.
టోక్యోలోని ఒలింపిక్ విలేజ్లో శనివారం జరిగిన వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో చాను రజత పతకం సాధించింది. మొత్తం 202 కేజీల బరువు( (87 kg + 115 kg)ను ఆమె లిఫ్ట్ చేసింది. మొదటి స్థానంలో చైనాకు చెందిన హౌ జిహుయ్ నిలిచారు. జిహుయ్ 210 కేజీల బరువును లిఫ్ట్ చేశారు. తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేయడం వల్లే ఈరోజు పతకం సాధించగలిగానని రజత పతకం సాధించిన తర్వాత మీరాబాయి వెల్లడించారు. 2017లో తాను వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం చాలా కష్టపడ్డానని... ఆ సమయంలో తన సోదరి వివాహానికి కూడా వెళ్లలేదని తెలిపారు. రియో ఒలింపిక్స్లో విఫలమయ్యాక వరల్డ్ ఛాంపియన్షిప్లో ఎలాగైనా సత్తా చాటాలన్న ఉద్దేశంతో కఠోర శ్రమ చేశానని తెలిపారు. శ్రమకు తగినట్లే వరల్డ్ ఛాంపియన్షిప్లో మీరాబాయి మెడల్ సాధించారు. గతంలో కామన్ వెల్త్ క్రీడల్లోనూ పలు పతకాలు సాధించారు.
వెయిట్ లిఫ్టింగ్లో మీరాబాయి సాధించిన పతకాలకు గాను గతంలోనే ఆమెకు పద్మశ్రీతో పాటు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు కూడా వరించాయి. తాజాగా ఆమె ఒలింపిక్స్లో సత్తా చాటడంతో మీరాబాయి ఇంట పండగ వాతావరణం నెలకొంది. మీరాబాయి గెలుస్తుందని ముందుగానే ఊహించిన ఆ కుటుంబం బంధుమిత్రులు,సన్నిహితులతో కలిసి ఇంటి బయట టీవీ పెట్టుకుని ఒలింపిక్స్ వీక్షించారు.మీరాబాయి గెలవగానే సంబరాలు చేసుకున్నారు.