షాక్: సీబీఐ అధికారులమంటూ సీఎం తమ్ముడినే కిడ్నాప్ చేశారు!
కోల్కతా: తాము సీబీఐ అధికారులమంటూ ఏకంగా ఓ ముఖ్యమంత్రి సోదరుడినే కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో చోటు చేసుకుంది. కిడ్నాపైన వ్యక్తి మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సోదరుడు కావడం గమనార్హం.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ సోదరుడు టోంగ్బ్రామ్ లుఖోయ్ సింగ్ కోల్కతాలో నివాసముంటున్నారు. న్యూటౌన్లో లుఖోయ్ సింగ్ కొత్తగా తీసుకున్న ఇంటికి శుక్రవారం ఐదుగురు వ్యక్తులు వచ్చారు. తాము సీబీఐ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడి లుఖోయ్ సింగ్ తోపాటు మరొకరిని కిడ్నాప్ చేశారు.
ఈ క్రమంలో వెంటనే లుఖోయ్ సింగ్ భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షణాల్లోనే రంగంలోకి దిగిన పోలీసులు.. శుక్రవారం సాయంత్రంలోగానే ఆ ఐదుగురిలో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. మరో ముగ్గురు నిందితులను కూడా శనివారం ఉదయం సెంట్రల్ కోల్కతాలోని బేనియాపుకుర్లో అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రెండు వాహనాలు, మూడు నకిలీ తుపాకులు, రూ. 2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు మణిపూర్, మరో ఇద్దరు కోల్కతా, ఒకరు పంజాబ్కు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు. నిందితులపై గతంలో కూడా పలు క్రిమినల్ కేసులున్నాయని, కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశారని ఆయన వెల్లడించారు.