కర్ణాటక ఎఫెక్ట్: ప్రభుత్వ ఏర్పాటుకు సై: గవర్నర్కు మణిపూర్ కాంగ్రెస్ వినతి
న్యూఢిల్లీ : మణిపూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం శుక్రవారం నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఆ రాష్ట్ర గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు.
కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించినందునందున బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మణిపూర్ లో కాంగ్రెస్ నేతలు గవర్నర్ కలిసి వినతి పత్రం సమర్పించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
9 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మణిపూర్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న మాజీ సీఎం ఓక్రమ్ సింగ్ రాష్ట్ర ఇంఛార్జీ గవర్నర్ గా ఉన్న జగదీష్ ముఖీని కలిసి వినతి పత్రం సమర్పించారు.
60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 28 సీట్లను కైవసం చేసుకొంది. బిజెపికి కేవలం 21 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిపి బిజెపి మణిపూర్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2017లో మణిపూర్ లో బిజెపి ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అప్పటి గవర్నర్ నజ్మాహెప్తుల్లా ఆహ్వానించారు. మణిపూర్ లో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం కొనసాగుతోంది.
కర్ణాటకలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో తమకు కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వనించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిశారు. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినా కానీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేదు.
బీహర్ లో ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో బిజెపియేతర పార్టీలన్నీ ప్రస్తుతం కర్ణాటక ఉదంతాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరుతున్నాయి.