ఇంట్లో ఇల్లాలు.. సహజీవనంలో ప్రియురాలు : కోర్టు ఝలక్.. కలెక్టర్ ఫసక్..!
మణిపూర్: ఒక వ్యక్తి మరో వ్యక్తికి అన్యాయం చేశారంటే న్యాయం కోసం చట్టపరంగా పోరాటం చేస్తారు. ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మరో మహిళతో సహజీవనం చేస్తే అదికూడా నేరం కిందనే పరిగణించబడుతుంది. ఇక ఒక వ్యక్తికి పెళ్లి అయ్యిందని తెలిసి కూడా మరో మహిళ అతన్ని ముగ్గులోకి దింపి సహజీవనం చేస్తే కూడా నేరమే అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
ఐఏఎస్ అధికారి శ్యాంసుందర్ సింగ్ సహజీవనం
డాక్టర్ రంజిత అచోమ్ అనే మహిళ ఇంపాల్లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పనిచేస్తోంది. ఆమె 2009కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ కొన్సమ్ శ్యాంసుందర్సింగ్ను వివాహమాడింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఇంతవరకు సాఫీగానే సాగిన కాపురం ఒక్కసారిగా టర్న్ తీసుకుంది. కొత్త క్యారెక్టర్ శ్యాంసుందర్ సింగ్ జీవితంలోకి ఎంటర్ అయ్యింది. ఆమెపేరే యాంబెమ్ పూనీ. శ్యాంసుందర్ ఆమెతో సహజీవనం చేయడం ప్రారంభించారు. ఇక డాక్టర్ రంజిత అచోమ్ తనకు న్యాయం చేయాలంటూ రూ.10 కోట్లకు మణిపూర్ కోర్టులో దావా వేసింది. వారిద్దరి అక్రమ సంబంధంతో సమాజంలో తనకు అవమానాలు ఎదురైయ్యాయని పేర్కొంది. ఎంతో మనోవేదన చెందిందని వెల్లడించింది.
పూనీని రెండో భార్యగా గుర్తించలేము
సెప్టెంబర్ 13న మణిపూర్ కోర్టు వాదనలు వినింది. పూనీతో తనకు అక్రమ సంబంధం ఉందని ఒప్పుకున్నాడు శ్యాంసుందర్ సింగ్. అయితే పూనీ మాత్రం తనను శ్యాంసుందర్ సింగ్కు రెండో భార్యగా గుర్తించాలంటూ కోర్టుకు తెలిపింది. ఎందుకంటే స్థానికంగా గుర్తింపు పొందిన వేడుక ద్వారా 2016లో ఇద్దరూ ఒక్కటయ్యారని జడ్జికి తెలిపింది. అయితే 1955 హిందూ వివాహ చట్టం ప్రకారం పూనీ శ్యాంసుందర్కు రెండవ భార్య కాదని వెల్లడించింది కోర్టు. ముందే పెళ్లయిన వ్యక్తితో మరో వ్యక్తి సహజీవనం చేస్తుంటే ముందున్న వివాహ బంధాన్ని తెంచినట్లు అవుతుందని భార్యా భర్తలను విడగొట్టినట్లు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.
శ్యాంసుందర్ భార్యకు రూ. 70 లక్షలు చెల్లించాలి
అక్టోబర్ 18న ఎట్టకేలకు తీర్పు చెప్పారు జడ్జి వై. సోమర్జీత్ సింగ్. శ్యాంసుందర్ అసలు భార్య అయిన డాక్టర్ అచోమ్కు రూ.70 లక్షలు చెల్లించాల్సిందిగా పూనీని ఆదేశించారు జడ్జి. మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.10 లక్షలు, సమాజంలో భార్య విలువను తక్కువ చేసినందుకు మరో రూ.10 లక్షలు, ఇక ఇతర నష్టాలకు మరో రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పూనీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
మొత్తానికి ఇది సరైన తీర్పేనా.. లేక భర్త శ్యాంసుందర్ సింగ్ డబ్బులు చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పు చెప్పి ఉంటే బాగుండేదా..? అనేది ఈ కేసును చదవిన చాలా మంది ఆలోచిస్తున్నారు.