షాక్: తాజ్ మహల్ లోకి మణిపూర్ విద్యార్థులకు నో ఎంట్రీ !
ఆగ్రా: విహారయాత్రకు వెళ్లిన మణిపూర్ విద్యార్థులను ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అయిన ఆగ్రాలోని తాజ్ మహల్ లోకి అడుగు పెట్టనివ్వకపోవడంతో ఇప్పుడు పెద్ద రచ్చ మొదలైయ్యింది. ఎందుకు విద్యార్థులను తాజ్ మహల్ చూడటానికి అనుమతి ఇవ్వలేదని విచారణ మొదలైయ్యింది.
ఇంఫాల్ లోని సెంట్రల్ వ్యవసాయ విశ్వవిధ్యాయానికి చెందిన విద్యార్థులు భారతదేశంలోని ముఖ్య ప్రాంతాలను చూడటానికి విహారయాత్రకు బయలుదేరారు. ఆదివారం మద్యాహ్నం 3.30 గంటలకు అందరూ తాజ్ మహల్ చూడటానికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది (సీఐఎస్ఎఫ్) విద్యార్థులను అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
తాజ్ మహల్ వీక్షించాలంటే వీదేశీయులు రూ. 1,000, రూ. భారతీయులు రూ. 40 టిక్కెట్లు తీసుకోవాలి. మణిపూర్ విద్యార్థులు చూడటానికి వీదేశీయులు లాగా ఉన్నారని ఆరోపిస్తూ అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతి ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై భారత పురావస్తు శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మణిపూర్ విద్యార్థులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై విచారణకు ఆదేశాలు జారీ చేశామని, తాజ్ మహల్ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న సీసీ కెమెరాల క్లిప్పింగ్స్ ఇవ్వాలని సూచించామని భారత పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.