హస్తినలో విజయంపై మనీశ్ సిసోడియా ధీమా: ఐదేళ్లలో చేసిన పనులే శ్రీరామరక్ష, బీజేపీ నేతల పూజలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరిగి విజయం సాధిస్తోందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అంటున్నారు. ఆప్ విజయంపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ధీమాతో ఉన్నారు. గత ఐదేళ్లుగా తమ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డదని వివరించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తన ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ విజయం తథ్యమని అన్నారు.
కేజ్రీవాల్ ఇంటి వద్ద కోలాహలం..
ఢిల్లీ లెక్కింపు సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి భారీగా మద్దతుదారులు చేరుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ 70 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అక్కడినుంచే పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ 70 నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. 672 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. పురుషులు 593 మంది కాగా.. 79 మంది మహిళలు పోటీ చేశారు.
ప్రత్యేక పూజలు
మరోవైపు కాన్నాట్లో గల హనుమంతుడి ఆలయంలో బీజేపీ నేత విజయ్ గోయల్ ప్రత్యేక పూజలు చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయంపై చీఫ్ మనోజ్ తివారీ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ విజయం సాధించడం తథ్యమని చెప్పారు. బీజేపీ 55 సీట్లు వస్తాయని, మీరేం ఆశ్చర్యపోవద్దని మీడియాను ఉద్దేశించి కామెంట్ చేశారు.
అరవింద్ బరిలో...
న్యూఢిల్లీ నుంచి ఆప్ నుంచి బరిలోకి దిగిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ బరిలోకి దిగారు బీజేపీ నుంచి సునీల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నుంచి రమేశ్ సబర్వాల్ పోటీ చేశారు. 2015లో ఇక్కడినుంచి విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
సిసోడియా, అల్కా లంబా
ప్రతాప్గంజ్ నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పోటీ చేశారు. బీజేపీ నుంచి బరిలో రవీందర్ సింగ్ నేగి, కాంగ్రెస్ నుంచి లక్ష్మణ్ రావత్ బరిలో ఉన్నారు. చాందినీ చౌక్ నుంచి అల్కా లంబా బరిలో ఉన్నారు. 2015లో ఆప్ నుంచి పోటీ చేసి విజయం సాధించిన అల్కా.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి ఆప్లో చేరిన ప్రహ్లాద్ సింగ్ శానీ.. ఆప్ నుంచి బరిలోకి దిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రహ్లాద్ సింగ్.. 2015లో మాత్రం అల్కా లంబాపై మాత్రం ఓడిపోయారు.