కాంగ్రెస్కు షాక్: గడ్కరీకి సారీ చెప్పిన మనీష్ తివారీ
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు మనిష్ తివారీ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీకి క్షమాపణలు చెప్పారు. మనీష్ తివారీ తగ్గిన నేపథ్యంలో నితిన్ గడ్కరీ ఆయన పైన దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును న్యాయస్థానం నుండి ఉపసంహరించుకున్నారు.
కాంగ్రెసు పార్టీతో పాటు ఆ పార్టీ నాయకులు కూడా ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ రెండో పెళ్లి దుమారం చల్లారకముందే.. మనీష్ తివారీ ఇబ్బందుల్లో పడ్డారు.
కార్గిల్ అమరవీరులకు మహారాష్ట్ర సర్కారు కేటాయించిన ఆదర్శ ఫ్లాట్లలో గడ్కరీకి కూడా ఫ్లాట్ ఉందంటూ మనీష్ తివారీ గతంలో తీవ్ర వాఖ్యలు చేశారు. దీనిపై గడ్కరీ 2010 డిసెంబర్ నెలలో పరువు నష్టం దావా వేశారు. కేసు వేగం పుంజుకుంది. దీంతో మనీష్ తివారీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అరెస్టు తప్పించుకునేందుకు గడ్కరీని మనీష్ క్షమాపణలు కోరారు. చల్లబడ్డ గడ్కరీ కూడా గడ్కరీ కూడా కేసును వెనక్కి తీసుకున్నారు.
తాను చేసిన వ్యాఖ్యలకు మనీష్ తివారీ క్షమాపణలు చెప్పారని, దీంతో గడ్కరీ కేసును ఉపసంహరించుకున్నారని గడ్కరీ న్యాయవాది రామేశ్వర్ గీతే చెప్పారు.
గడ్కరీకి తివారీ ఓ లేఖ రాశారు. తాను చేసిన ఆరోపణలతో కలత చెంది ఉంటావని, తాను చేసిన వ్యాఖ్యల పైన క్షమాపణలు కోరుతున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో తాను ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించి గడ్కరీ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. అదే సమయంలో కేసును వెనక్కి తీసుకోవాలని కోరారు.