మీ సాయం గుర్తుంచుకుంటాం: మనీషా కోయిరాలా, చలించిన మోడీ
న్యూఢిల్లీ/ఖాట్మాండ్: భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ పట్ల భారత ప్రభుత్వం చూపిస్తున్న చొరవను ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా స్పందించారు. ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ భూకంపై పైన వేగంగా స్పందించిన భారత్ తీరు నేపాలీయుల హృదాయలను తాకిందని చెప్పవచ్చు.
ఇందులో భాగంగా మనీషా కోయిరాలా స్పందించారు. తమ దేశాన్ని ఆదుకునేందుకు మోడీ స్పందించిన తీరు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే అన్నారు. భూకంపం తర్వాత నేపాల్ను చూసి తనకు కన్నీళ్లు ఆగలేదన్నారు. నేపాల్ను ఆదుకుంటున్న భారత్కు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. మోడీ గారు ఇంత త్వరగా స్పందించి చేసిన సాయాన్ని తాము ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటామన్నారు.
ప్రధాని మన్ కీ బాత్
భూకంపం నేపాల్ను తీవ్రంగా నష్టపరిచిందని ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో ఆదివారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన గుజరాత్లోని కచ్ భూకంపాన్ని గుర్తు చేసుకున్నారు. నేపాల్కు భారత్ అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. నేపాల్ భూకంపం కదిలించిందన్నారు.
2001 జనవరి 26న గుజరాత్లోని కచ్లో ఇలాంటి భూకంపమే పెను విషాదాన్ని నింపిందన్నారు. నా నేపాల్ సోదర, సోదరీమణులా.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ మీ వెన్నంటే ఉంటుందని అన్నారు. భారత్లోని 125 కోట్ల మంది ప్రజలు నేపాల్ కన్నీళ్లు తుడిచేందుకు ముందుకు వస్తారన్నారు.
భారతీయులు చేతులు కలిపి మీకు అండగా నిలబడతారన్నారు. ప్రస్తుతం తమ దృష్టి ఆపదలో ఉన్న వారిని కాపాడటం పైనే అన్నారు. కొద్ది రోజుల క్రితం బీహార్లో అకాల వర్షాలు రైతులకు నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ భూకంపం మొత్తం ప్రపంచాన్ని కదిలించిందన్నారు.
వరుసగా ఎదురవుతున్న విపత్తుల పట్ల మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూకంపం వల్ల భారత దేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా పలువురు మృతి చెందారన్నారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందన్నారు. నేపాల్లో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం ఎంతో ఉందన్నారు.