మా హయాంలో చాలా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు మోడీ సర్జికల్ స్ట్రైక్స్ గురించి పదేపదే బహిరంగసభల్లో మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ చాలా జరిగాయని అయితే ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ఎప్పుడూ వాటిగురించి మాట్లాడలేదని చెప్పారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే సమాచారం ఉన్న సమయంలో త్రివిధ దళాలకు అన్ని హక్కులు ఇచ్చామని మన్మోహన్ సింగ్ గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని చెప్పిన మన్మోహన్ సింగ్... మిలటరీ ఆపరేషన్స్ అన్నీ దేశవ్యతిరేక శక్తులపైనే జరుగుతాయని చెప్పారు. అంతే తప్పా మిలటరీ ఆపరేషన్స్ పేరుతో ఓట్లు దండుకోవడం హేయమైన చర్య అని మన్మోహన్ ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పదేపదే సర్జికల్ స్ట్రైక్స్ గురించి చెబుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. మరోవైపు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
మన్మోహన్ సింగ్ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ చాలానే జరిగాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలుమార్లు చెప్పినప్పటికీ... స్వయంగా మన్మోహన్ సింగ్ తొలిసారిగా తనకు తానుగా ధృవీకరించారు. పఠాన్కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రదాడి జరిగితే పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐని విచారణ చేయాల్సిందిగా ఆహ్వానించడం బీజేపీ చేసిన అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదంగా అభివర్ణించారు మన్మోహన్ సింగ్. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించలేదని చెప్పిన మన్మోహన్ సింగ్... తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోడీ సర్జికల్ స్ట్రైక్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వంలో తాను కేబినెట్ మంత్రిగా ఉన్న సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ 11 సార్లు జరిగాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓ సందర్భంలో చెప్పారు.