లోకసభ ఎన్నికలు: కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తికి నో చెప్పిన మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ సొంత పార్టీ ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించారట. పంజాబ్లోని అమృత్సర్ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపించడం లేదట. ఆ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం ఆయనను బరిలోకి దింపాలని చూస్తోంది. ఆయన మాత్రం ససేమీరా అంటున్నారట.
ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని మన్మోహన్ సింగ్కు చెబితే.. ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా చెబుతున్నారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆశాకుమారి మాట్లాడుతూ... పార్టీ వర్గాలు ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రజలు అందరూ ఆయన అమృత్సర్ నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. త్వరలో ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పంజాబ్లో సీట్ల కేటాయింపు పైన కాంగ్రెస్ పార్టీ ఆదివారం సమావేశమైంది. అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. జాబితా తుదిరూపు సంతరించుకోలేదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చెప్పారు. పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో త్వరలోనే సమావేశం నిర్వహించి పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. 2009, 2014లోనూ అమృత్సర్ నుంచి పోటీకి వివిధ కారణాల రీత్యా మన్మోహన్ తిరస్కరించారు.
అందుకే పవన్ కళ్యాణ్కు కేసీఆర్ దూరమా, ఆ ఆశలపై జనసేన నీళ్లు చల్లుతుందా?
2004 నుంచి 2014 వరకు రెండుసార్లు ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ ఆ రెండు సార్లు రాజ్యసభ నుంచే ప్రాతినిథ్యం వహించారు. 2009లో అమృత్సర్ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ అనారోగ్య కారణాలతో పోటీ చేయలేదు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ... కెప్టెన్ అమరీందర్ సింగ్ చేతిలో ఓడిపోయారు.
మన్మోహన్ సింగ్ 1991లో అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. అతను ఎప్పుడు కూడా లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేదు. 1999లో దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేసిన మన్మోహన్ బీజేపీ నేత వీకే మల్హోత్రా చేతిలో ఓడిపోయారు.