మన్మోహన్ సెక్యూరిటీని కొట్టిన విదేశీ స్త్రీ, హోటల్లో అమెరికన్ మహిళ మృతి
న్యూఢిల్లీ/ధర్మశాల: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సెక్యూరిటీ గార్డు పైన ఓ మహిళ చేయి చేసుకున్నారు. పలువురు పోలీసు అధికారుల ముందే ఈ ఘటన జరిగింది. కాగా, చేయి చేసుకున్నది టర్కిష్ మహిళగా తెలుస్తోంది. అతను తన విధులు నిర్వర్తిస్తున్నందుకే చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. భద్రతా కారణాల వల్ల సెక్యూరిటీ గార్డు ఆమెను అడ్డుకున్నారు. దీంతో చేయి చేసుకున్నారని తెలుస్తోంది. సదరు మహిళ ఢిల్లీలో ఓ పుస్తకావిష్కరణ నిమిత్తం వచ్చారని సమాచారం. ఈ వీడియోను ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఫోటో గ్రాఫర్ తీశారు.
వీడియోలో... ఆ మహిళ గార్డుతో వాగ్వాదానికి దిగింది. తనను లోనికి పంపించాలని డిమాండ్ చేసింది. కాసేపటి తర్వాత ఆమె అతని పైన చేయి చేసుకుంది. ఆమె పైన ఏమైనా చర్యలు తీసుకున్నారా తెలియాల్సి ఉంది.
'ఆమె కొడతానని బెదిరించి, అన్నంత పని చేసిందని, బాధాకరమైన విషయమేమంటే పలువురు పోలీసు అధికారుల ముందు ఆమె అలా చేయడమని, ఎవరు కూడా ఏం చేయలేకపోయార'ని వీడియో తీసిన వ్యక్తి పేర్కొన్నారు.
ధర్మశాల హోటల్లో అమెరికా మహిళ అనుమానాస్పద మృతి
భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ మహిళ ఒకరు హిమాచల్ ప్రదేశ్లోని ఓ హోటల్లో అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. ఆమె పేరు లిలియన్ (67). నాలుగు రోజులుగా ఆమె తన గది నుంచి బయటకు రాలేదు.
ఆదివారం రాత్రి ఆమె ఉంటున్న గది నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో హోటల్ సిబ్బంది తలుపులు తెరిచి చూశారు. అప్పటికే లిలియన్ మృతదేహం కుళ్లిపోయి ఉంది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.