పాకిస్తాన్ వెళ్లడానికి సిద్ధపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్: వచ్చేెనెల ప్రయాణం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ త్వరలో పాకిస్తాన్ కు వెళ్లనున్నారు. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా కొద్దిరోజుల కిందటే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ విజ్ఞప్తిని తోసి పుచ్చిన ఆయన..తాజాగా ఆ దేశానికి వెళ్లడానికి అంగీకరించారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చేసిన ఆహ్వానం మేరకు మాత్రమే మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ వెళ్లనున్నారు.
పాకిస్తాన్ ఆహ్వానాన్ని తిరస్కరించనున్న మన్మోహన్ సింగ్
గురువారం అమరీందర్ సింగ్ న్యూఢిల్లీలో మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. భారత్-పాకిస్తాన్ మధ్య మధ్య వారధిలా భావిస్తోన్న కర్తార్ పూర్ లో వెలసిన సిక్కుల ప్రప్రథమ గురువు గురు నానక్ 550వ జయంత్యుత్సవాల్లో పాల్గొనడానికి పంజాబ్ నుంచి బయలుదేరి వెళ్లే అఖిల పక్ష బృందానికి నేతృత్వం వహించాలని కోరారు. దీనికి మన్మోహన్ సింగ్ అంగీకరించారు. కర్తార్ పూర్ వెళ్లడానికి సిద్ధమేనని వెల్లడించినట్లు రవీన్ థుక్రాల్ తెలిపారు. వచ్చేెనెల 9వ తేదీన అఖిల పక్ష బృందం కర్తార్ పూర్ కు బయలుదేరి వెళ్తుందని, దీనికి నాయకత్వం వహించడానికి మన్మోహన్ సింగ్ అంగీకరించినట్లు చెప్పారు. కర్తార్ పూర్ తో పాటు సుల్తాన్ పూర్ లోధీని కూడా మన్మోహన్ సింగ్ సందర్శిస్తారని అన్నారు.
నిజానికి- మన్మోహన్ సింగ్ పుట్టిన ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. రావల్పిండి సమీపంలోని గాహ్ గ్రామంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. విభజన అనంతరం ఆ గ్రామం పాకిస్తాన్ లో కలిసి పోయింది. విభజన తరువాత ఆయన ఎప్పుడూ వ్యక్తిగతంగా పాకిస్తాన్ వెళ్లలేదు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం, గురు నానక్ 550వ జయంత్యుత్సవాలకు తాము మన్మోహన్ సింగ్ ను ఆహ్వానిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ ఆహ్వానాన్ని మన్మోహన్ సింగ్ తిరస్కరించారు. తాను కర్తార్ పూర్ కు వెళ్లట్లేదని స్పష్టం చేశారు.
Happy to meet former Prime Minister Dr. Manmohan Singh ji at his residence today. Have invited him to join us on the 1st Jatha to Sri Kartarpur Sahib Gurudwara & attend the main event at Sultanpur Lodhi to mark Sri Guru Nanak Dev Ji's #550thPrakashPurab. pic.twitter.com/CZw5bbeUDj
— Capt.Amarinder Singh (@capt_amarinder) October 3, 2019
సిక్కుల ప్రథమ మత గురువు, ఏకేశ్వరోపాసనను బోధించిన గురునానక్ చాలాకాలం పాటు జీవించిన ప్రదేశం అది. సిక్కుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల దీనికి రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గానీ, యుద్ధ వాతావరణం గానీ సోకలేదు. భారత్ కు చెందిన సిక్కులు విదేశాంగ పరమైనటువంటి ఎలాాంటి అడ్డంకులు లేకుండా, స్వేచ్ఛగా కర్తార్ పూర్ ను సందర్శించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు కర్తార్ పూర్ కారిడార్. గురునానక్ జయంతి నాటికి పూర్తి కానుంది.