'మన్మోహన్ బలహీన ప్రధాని కాదు, కొన్ని కారణాల వల్ల మౌనం'
యూపీఏ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ బలహీనమైన ప్రధాని కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. కొన్ని కారణాల వల్ల మన్మోహన్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారన్నారు.
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ బలహీనమైన ప్రధాని కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. కొన్ని కారణాల వల్ల మన్మోహన్ తనను తాను ప్రొజెక్ట్ చేసుకోలేకపోయారన్నారు.
ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మనీష్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నకు పైవిధంగా సమాధానం ఇచ్చారు. మన్మోహన్ బలహీనమైన ప్రధాని కాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
ఒకవేళ ఆయన బలహీనమైన వ్యక్తి అయితే పౌర అణు ఒప్పందం దిశగా వెళ్లేవారే కాదని అభిప్రాయపడ్డారు. కొన్ని కారణాల వల్లే ఆయన మౌనం పాటించాల్సి వచ్చిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై తివారీ విమర్శలు గుప్పించారు. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రజలను విడగొట్టేలా మాట్లాడారని, ఓ ప్రధాని ఇలా మాట్లాడడం ఆందోళన కలిగించేలా ఉందన్నారు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతతో మాట్లాడాలన్నారు.