విశాఖ డైవర్స్పై ప్రధాని మోడీ ప్రశంసలు: సాంకేతికత చేటుగా మారిందని ఆవేదన, అయోధ్య తీర్పుపై..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' ద్వారా దేశ ప్రజలతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మన జీవన విధానమంతా ప్రకృతితోనే ముడిపడి ఉందని.. ప్రకృతి బాగుంటేనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
విశాఖ డైవర్స్పై.. మాతృ భాషను కాపాడుకోవాలంటూ..
నదులు, ప్రకృతి, పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా విశాఖట్నంలోని సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు కొందరు డైవర్స్ చేసిన కృషిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. అంతరించిపోతున్న మాతృ భాష, సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఫిట్ ఇండియా ప్రతి పాఠశాలో..
డిసెంబర్ నెలలో అన్ని పాఠశాలల్లో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసి, విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుదలకు కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు ర్యాంకులు కేటాయించాలని సూచించారు. డిసెంబర్ 7న సైనిక దళాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు.
సాంకేతికత చేటుగా మారిందని..
రాజకీయాల్లోకి వస్తానని చిన్నతనంలో అనుకోలేదనీ, ఆధ్యాత్మిక మార్గంలోనే వెళ్లాలన్నది తన ఆకాంక్ష అని ప్రధాని మోడీ తెలిపారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులకు చేటుగా మారిందని అభిప్రాయపడ్డారు. విజ్ఞానం కోసం పుస్తకాలు చదవడం మానేసి, గూగుల్లో వెతుకుతున్నారని మోడీ వ్యాఖ్యానించారు.
అయోధ్య తీర్పుపై ఇలా..
అయోధ్య తీర్పు సమయంలో దేశ ప్రజలు చూపిన సద్భావన హర్షణీయమని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. శాంతి, ఏకత, సౌభ్రాతృత్వం మన నినాదమని దేశ ప్రజలు మరోసారి చాటి చెప్పారని మోడీ హర్షం వ్యక్తం చేశారు. అక్టోబర్ 27న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ.. స్థానిక ఉత్పత్తులనే కొనాలని, లోకల్ ఫెస్టివల్ టూరిజాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.