ఐదేళ్లలో కొత్త భారత్: నరేంద్ర మోడీ, మహిళా క్రికెట్ టీంకు ప్రశంస
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాటి మన్ కీ బాత్లో జిఎస్టీ, అసోం, రాజస్థాన్ వరదలు తదితర అంశాలపై మాట్లాడారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాటి మన్ కీ బాత్లో జిఎస్టీ, అసోం, రాజస్థాన్ వరదలు తదితర అంశాలపై మాట్లాడారు.
ఒకే దేశం - ఒకే పన్ను అమలులోకి తీసుకురావడం ద్వారా అభ్యదయ భారతావని ఓ సుదీర్ఘ కలను సాకారం చేసుకున్నట్లయిందని మోడీ అన్నారు. ఐదేళ్లలో కొత్త భారత్ను తయారు చేద్దామన్నారు.
జీఎస్టీని ఆర్థిక వ్యవస్థను బలపరిచే సామూహిక శక్తిగా అభివర్ణించారు. ఈ విధానం అమలుతో తక్కువ సమయంలోనే ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనిపిస్తోందన్నారు. కొత్త పన్ను విధానం దేశాభివృద్ధికి కీలకమని ప్రజల్లో అవగాహన కల్పించడంలో కేంద్రం విజయవంతమైందన్నారు.
ఇప్పటికే ప్రభుత్వం, వ్యాపారులు, వినియోగదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడిందని ఇది కేవలం పన్నుల సంస్కరణ మాత్రమే కాదని, దేశాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యమున్న ఔషధమని అభివర్ణించారు.
వాతావరణంలో మార్పులను ప్రస్తావించిన ఆయన, ఈ మార్పులు కొన్ని చోట్ల ప్రతికూల ప్రభావాలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
అసోం, రాజస్థాన్ం గుజరాత్, బంగాల్ ప్రాంతంలో కరుస్తున్న భారీ వర్షాలకు, జనజీవనం అస్తవ్యస్థం కావడానికి వాతావరణ మార్పులే కారణమన్నారు. ఈ వర్షాలు, ఆపై వరదలు ప్రజా జీవితంతో పాటు పంటలు, మౌలిక వసతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నారు.
నష్టపోయిన రాష్ట్రాల్లోని ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. వరదల పరిస్థితిపై 1078 హెల్ప్ లైన్ నంబరును ఏర్పాటు చేశామని, ఈ నంబరుకు ఫోన్ చేసి ఎవరు ఫిర్యాదు చేసినా సత్వరమే అధికారులు స్పందిస్తారని అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు కావస్తోంది. 2017ను సంకల్ప సంవత్సరంగా తీర్చిదిద్దాలని, రానున్న ఐదేళ్లలో కొత్త భారత్ కోసం ఇప్పటి నుంచే కృషి చేద్దామన్నారు. మహిళల ప్రపంచకప్లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని, వారిని చూసి దేశం గర్వపడిందన్నారు.