తిరుక్కురళ్ చదవండి..ఖాదీ మాస్కులు ధరించండి: అమెరికాలో మల్ల యోధులు తయార్: మోడీ
న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగల సందర్భంగా కళకళలాడాల్సిన దేశం కరోనా వైరస్ ప్రభావానికి గురైందని, వెలవెలబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దసరా సందర్భంగా గుజరాత్లో గర్భ, పశ్చిమ బెంగాల్లో కాళికా అమ్మవారి మండపాలతో భక్తులతో వెలిగిపోతుంటాయని, ఈ సారి అలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. బజారుకు వెళ్లి సరుకులను కొనుగోలు చేయడమే గగనంలా మారిందని అన్నారు. పండుగల సమయంలో సైనికుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.
సరిహద్దుల్లో కఠినతర వాతావరణ పరిస్థితుల్లో, కుటుంబానికి దూరంగా, ప్రాణాలను ఎదురొడ్డి పహారా కాస్తున్నారని మోడీ అన్నారు. వారికి కృతజ్ఙతలు తెలుపుకోవడానికి ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించాలని చెప్పారు. ఆదివారం ఆయన తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్లో మాట్లాడారు. దేశంలో ఖాదీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు. ఆత్మనిర్భర్, లోకల్ టు వోకల్కు అసలు సిసలైన నిర్వచనంలా మారిందని అన్నారు. మెక్సికోలోని ఒహాకాలో స్థానిక మెక్సినక్ బ్రౌన్.. ఖాదీని ప్రమోట్ చేస్తున్నారని చెప్పారు.
ఖాదీని సాధారణ వస్త్రంలా భావించట్లేదని అన్నారు. ఖాదీ మాస్కులకు డిమాండ్ లభిస్తోందని అన్నారు. సెల్ప్ హెల్ప్ గ్రూపులు ఖాదీ మాస్కులను ఉత్పత్తి చేస్తున్నారని, వేలాదిగా వాటిని తయారు చేస్తున్నారని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. అమెరికాలోని చిన్మయ్ పాఠంకర్ మల్లయోధులను తయారు చేస్తున్నారని మోడీ ప్రశంసించారు.
Recommended Video
అమెరికా యువత మల్లయుద్ధంపై దృష్టి పెడుతున్నారని మోడీ చెప్పుకొచ్చారు. భారతీయులు విస్మరించిన మల్లఖంబాను అమెరికన్లు నేర్చుకోవడం గర్వకారణమని మోడీ అన్నారు. తమిళనాడుకు చెందిన తిరుక్కురళ్ను ప్రతి ఒక్కరూ చదవాలని మోడీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడులోని తూత్తుకుడికి చెందిన పొన్ మరియప్పన్తో మాట్లాడారు. మోడీ తన సంభాషణను తమిళంలో కొనసాగించారు.