మళ్లీ గెలిచిన తర్వాత మీ ముందుకు వస్తా: మన్ కీ బాత్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం (24 ఫిబ్రవరి) తన చివరి మన్ కీ బాత్లో మాట్లాడారు. ఆలిండియా రేడియో ద్వారా తన మన్ కీ బాత్ను వింటున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతానికి ఇది చివరి మన్ కీ బాత్ అని, ఆ తర్వాత తిరిగి తామే గెలుస్తామని, మే 2వ తేదీన మళ్లీ మన్ కీ బాత్తో మీ ముందుకు వస్తానని చెప్పారు. ఆయన ప్రతి నెల చివరి ఆది వారం ఆలిండియా రేడియో ద్వారా మాట్లాడుతారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ పుల్వామా ఆత్మాహుతి దాడిని ఖండించారు. అమరజవాన్లకు నివాళులు అర్పించారు. పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు శాంతి చేకూరాలని, దేశం కోసం పాటుపడుతున్న జవాన్లకు మనం ఎంతో రుణపడి ఉన్నామని, జవాన్ల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఇది తన చివరి మన్కీ బాత్ కార్యక్రమమన్నారు. ఎన్నికలు ఉండటంతో మళ్లీ మే నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతానని చెప్పారు. లోకసభ ఎన్నికల్లో విజయం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశ ప్రజల ఆశీస్సులతో మళ్లీ మే నెలలో మీ అందరితో వచ్చి ఇలా మాట్లాడుతానని, త్వరలో ఎన్నికలు ఉండటంతో మీ ముందుకు రాలేనని, ప్రజాస్వామ్య విలువలు కాపాడటం తన బాధ్యత అన్నారు. అందుకే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కుదరదని చెప్పారు. ఫిబ్రవరి 29న మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ జయంతి సందర్భంగా ఆయనకు జోహార్లు అన్నారు. ప్రతి నాలుగేళ్లకోసారి మాత్రమే ఆయన జయంతిని జరుపుకోగలుగుతున్నామని, రాజ్యాంగంలో ఆయన 44వ సవరణను తీసుకొచ్చారని, ఆయన దేశానికి చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు.
మార్చి 3న బిర్సా ముండా, జంషేడ్ టాటా జయంతి ఉంది. వారిని కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. బిర్సా ముండా త్యాగాలు, బలిదానాన్ని మరువలేమని, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడని, దేశం కోసం ఇరవై అయిదేళ్ల వయససులో బలిదానమయ్యారని పేర్కొన్నారు.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, టాటా స్టీల్ వంటి ఎన్నో సంస్థలను జంషేడ్ టాటా నెలకొల్పారని, అప్పటి టాటా సైన్సెస్ సంస్థ ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్గా మారిందన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం విశేష కృషి చేస్తోందని, దేశంలోని యువత అందరూ ఓటేయడానికి ముందుకు రావాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తప్పకుండా ఓటేయాలన్నారు.