హస్తినలో హైడ్రామా: ముఖ్యమంత్రిగా ఖట్టర్.. రేపు ప్రమాణం: దీపావళి తరువాత బల నిరూపణ
చండీగఢ్: హర్యానా రాజకీయాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి రాజకీయ పరిణామాలు తలకిందులయ్యాయి. చేజారిపోయిందనుకున్న హర్యానాలో భారతీయ జనతాపార్టీ మళ్లీ పాగా వేయనుంది. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్ శనివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో- శుక్రవారం ఆయన గవర్నర్ ను కలుసుకోనున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన వినతిపత్రాన్ని ఆయన గవర్నర్ కు అందజేయనున్నారు.
దీపావళి తరువాత.. బల నిరూపణ
దీపావళి తరువాత మనోహర్ లాల్ ఖట్టర్ అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోనున్నారు. 40 మంది సభ్యులతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అయిదు స్థానాలు తగ్గిపోయాయి. కాంగ్రెస్ కు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని స్థానాలు దక్కలేదు. ఫలితంగా- హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటైంది. కాగా- స్వతంత్రంగా విజయం సాధించిన అయిదుమంది అభ్యర్థులు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనితో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంటుంది. హర్యానా లోక్ హిత పార్టీ నుంచి గెలిచిన సభ్యుడితో పాటు మరో ఇద్దరు బీజేపీకి మద్దతు ఇవ్వనున్నారు.
ఆ అయిదుమందీ వీరే..
రణ్ ధీర్ సింగ్ గొల్లెన్ (ఫుండ్రి), బల్రాజ్ కుండు (మెహమ్), రంజిత్ సింగ్ (రనియా), రాకేశ్ దౌల్తాబాద్ (బాద్షాపూర్), గోపాల్ కందా (సిర్సా). ఈ అయిదుమంది బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మనోహర్ లాల్ ఖట్టర్ కు మద్దతు లేఖను సైతం అందించారు. దీనితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి ఇక ఒక్క ఎమ్మెల్యే మద్దతు అవసరమైంది. ఈ నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్.. దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. అయిదుమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ పెద్దలన కలుసుకున్నారు. బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ లో నిరాశ..
స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలకడం కాంగ్రెస్ లో ఆందోళనకు దారి తీసింది. తాను సొంతంగా సాధించిన 31 స్థానాలతో పాటు జన్ నాయక్ జనతాపార్టీ (జేజేపీ)-10, ఐఎన్ఎల్డీ ఎమ్మెల్యేలు సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ఒకవంక మంతనాలు సాగిస్తోన్న సమయంలోనే స్వతంత్ర ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. బీజేపీ వైపు వారు మొగ్గు చూపడం, బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు లిఖితపూరకంగా తెలియజేయడం చకచకా సాగిపోయాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి.