ఖట్టార్ ప్రమాణం, అద్వానీ హాజరు: మోడీకి ఉద్ధవ్ దూరం
చండీగఢ్: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలోని పంచ్కులాలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
వీరితో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషీలు కూడా హాజరయ్యారు. హర్యానా గవర్నర్ కఫ్తాన్ సింగ్ సోలంకి మనోహర్ లాల్ ఖట్టర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. హర్యానాలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
సాయంత్రం ఎంపీలకు మోడీ తేనీటి విందు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం సాయంత్రం ఎన్డీయే ఎంపీలకు ఇస్తున్న తేనీటి విందుకు శివసేన ఎంపీలు హాజరు కానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, శివసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో ఈ విందు ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఎంపీలు ప్రధాని ఇస్తున్న విందుకు హాజరవుతారని శివసేన రాజ్యసభ ఎంపీ అనీల్ దేశాయ్ శనివారం తెలిపారు.
దూరంగా ఉద్ధవ్ థాకరే
శనివారం ముంబైలో జరిగిన రిలయన్స్ ఫౌండేషన్ వారి ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరేంద్ర మోడీ హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమానికి శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాకరే కనిపించలేదు. ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఓ పక్క మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన మద్దతు గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఉద్ధవ్ థాకరే ప్రధాని కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ, శివసేనల మధ్య వచ్చిన పొరపొచ్చలు ఇంకా తొలగలేదని కొందరు భావిస్తున్నారు.
బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణలపై విచారణ చేపట్టండి: ఈసీకి కాంగ్రెస్
ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ తొక్కుతున్న అడ్డదారులపై ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది.
ఢిల్లీ ఎన్నికలంటేనే భయపడిపోతున్న బీజేపీ, ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకునేందుకు అక్రమాలకు తెరతీసిందని ఆప్తో పాటు కాంగ్రెస్ కూడా ఆరోపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అసెంబ్లీ ఎన్నికల్లో తన అధికారాన్ని దుర్వినియోగం చేయదని ఎన్నికల సంఘం తమకు హామీ ఇవ్వాలని కాంగ్రెస్ నేత జేపీ అగర్వాల్ డిమాండ్ చేశారు.