ఓవర్ యాక్షన్ చేయొద్దు: రక్షణశాఖ మాజీమంత్రి మనోహర్ పారిక్కర్ కామెంట్స్
న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ చేతికి దొరికిన అస్త్రం రాఫెల్ డీల్. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని, దీని తయారీని దేశీయ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కు కాకుండా.. అనిల్ అంబానీకి చెందిన సంస్థకు అప్పగించడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే విమర్శలు ఉన్నాయి. ఇదే అంశంపై కొద్దిరోజులుగా లోక్ సభలోనూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటోంది.
ఈ పరిస్థితుల్లో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి రక్షణ శాఖ అధికారులు కొన్ని ప్రతిపాదనలను రూపొందించారు. దీన్ని వాళ్లు అప్పటి రక్షణశాఖ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కు అందజేశారు. దీన్ని చదివిన ఆయన.. రక్షణశాఖ వెలిబుచ్చిన కొన్ని సందేహాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సందేహాలను మనోహర్ పారిక్కర్ ఓవర్ యాక్షన్గా కొట్టి పారేశారని అంటున్నారు.
రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తమ ప్రతినిధుల బృందం ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తున్న సమయంలో.. ప్రధానమంత్రి కార్యాలయం కూడా దీనికి సమాంతరంగా చర్చలు చేపట్టిందని రక్షణ శాఖ ఈ ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రధానమంత్రి కార్యాలయమే నేరుగా చర్చలు జరపడం వల్ల తమ ప్రతినిధుల బృందం చర్చలు బలహీనపడ్డాయని, దీనికి ప్రాధాన్యత లేకుండా పోయిందని రక్షణశాఖ అభిప్రాయపడింది.
దీనిపై తాము పీఎంఓకు అభ్యంతరం తెలియజేయడానికి అవకాశం ఉందని పేర్కొంది. తమ ప్రతినిధుల బృందంతో సంబంధం లేని వారు ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందంపై చర్చించడం సబబు కాదని తాము పీఎంఓకు సూచించి ఉండొచ్చని పొందుపరిచింది. తమ ప్రతినిధుల బృందం ఫ్రాన్స్ ప్రభుత్వంతో నిర్వహిస్తున్న చర్చలు ఫలప్రదం కాబోవని పీఎంఓ కార్యాలయం అభిప్రాయ పడిందని తాము భావిస్తున్నట్లు రక్షణశాఖ పేర్కొంది.
2015 నవంబర్ 24వ తేదీన రక్షణమంత్రికి అందజేసిన ఈ ప్రతిపాదనలను ఎయిర్-2 ఉప కార్యదర్శి ఎస్ కె శర్మ సంతకం చేశారు. దీనిపై అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారిక్కర్ ప్రతికూలంగా స్పందించారని తెలుస్తోంది. రక్షణశాఖ అభిప్రాయాలను ఆయన ఓవర్ యాక్షన్గా కొట్టి పారేశారనే ఆరోపణలు ఉన్నాయి. రాఫెల్ ఒప్పందాల్లో ప్రధానమంత్రి కార్యాలయంల నేరుగా జోక్యం చేసుకుందని, రక్షణశాఖను బలహీనపరిచిందంటూ ఇన్నాళ్లూ కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలకు ఈ ఉదంతం బలం చేకూర్చుతుందని భావిస్తున్నారు.
దీనికి సంబంధించిన ఓ ఫొటో ఆంగ్ల దినపత్రికల్లో ప్రచురితమైంది. దీనిపై రక్షణశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. స్పందించారు. పాత్రికేయ విలువలకు భిన్నంగా ఈ కథనాన్ని ప్రచురించారని, అత్యంత గోప్యంగా ఉండాల్సిన రాఫెల్ ఒప్పందాలకు సంబంధించి.. రక్షణశాఖ ప్రతినిధుల అభిప్రాయాలతో కూడిన ప్రతిపాదనలను ఎలా బహిర్గతం చేస్తారని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. కొన్ని బహుళజాతి సంస్థల కోసం ప్రతిపక్షం రాఫెల్ ఒప్పందాలపై విమర్శలు గుప్పిస్తోందని ఆరోపించారు.