సిఎంగా పర్సేకర్ ప్రమాణం: డిప్యూటీ సిఎంగా డిసౌజానే
పానాజి: గోవా ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ సుఖాంతమైంది. గోవా ముఖ్మమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ శనివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ మృదుల సిన్హా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తిరుగుబాటు చేస్తానని చెప్పిన ఫ్రాన్సిస్ డిసౌజా వెనక్కి తగ్గారు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కొననసాగుతారు. పర్సేకర్తో పాటు పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరబోతున్న మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన వారసుడిగా ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా తిరుగుబాటు జెండాను ఎగురేసినప్పటికీ వెనక్కి తగ్గడానికి బిజెపి నాయకత్వం ఇష్టపడలేదు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని డిసౌజా హెచ్చరిన విషయం తెలిసిందే. ఆ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తమ నిర్ణయానికే బిజెపి నాయకత్వం కట్టుబడి ఉంది.
గోవా ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని బిజెపి నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూఢీ చెప్పారు. బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో నాయకుడిని ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. గవర్నర్ కార్యాలయానికి మనోహర్ పారికర్ తన రాజీనామా లేఖను పంపించారు. గవర్నర్ ఈ సాయంత్రం రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.
గోవా కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు బిజెపి పార్లమెంటరీ బోర్డు శనివారంనాడు ఢిల్లీలో సమావేశమైంది. పార్లమెంటరీ బోర్డు గోవా శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే విషయంపై, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సీటుకు అభ్యర్థి ఎంపికపై చర్చించినట్లు బిజెపి ప్రధాన కార్యదర్శి జెపి నడ్డా చెప్పారు. తుది నిర్ణయాన్ని సాయంత్రం 4 గంటలకు వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.
పార్లమెంటరీ బోర్డు సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. తిరుగుబాటు నాయకుడు ఫ్రాన్సిస్ డిసౌజాకు పది మంది శాసనసభ్యులు మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనోహర్ పారికర్ నరేంద్ర మోడీ మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి. నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని ఆదివారం మధ్యాహ్నం విస్తరిస్తున్నారు.